ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు
తాత్కాలిక పరిష్కారాలతో ఫలితం ఉండదని వ్యాఖ్య
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు నాణ్యత చాలా దారుణంగా ఉన్న దృష్ట్యా ఢిల్లీలోనూ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోనూ నిర్మాణాలపై నిషేధం విధించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. పర్యావరణ సంబంధమైన ఆందోళనలను అభివృద్ధితో సమతూకం చేసుకోవాలని సూచించింది. రాజధానిలో వేగంగా పెరిగిపోతున్న కాలుష్య స్థాయిలను అడ్డుకోవడానికి ‘సాహసోపేత నిర్ణయాలు’ జారీ చేయలేమని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవారు నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. బెంచ్లో నిపుణులెవరూ లేరని గుర్తు చేసింది. వాయు కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ నెల 19వ తేదీ నాటికి ప్రణాళికను రూపొందించాలని కేంద్రానికి సూచించింది. తాత్కాలిక పరిష్కారాలతో ఎలాంటి ఫలితం ఉండదని అంటూ కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాలను రూపొందించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పింది. రాజధానిలో ఏటా కాలుష్య నిర్వహణ చేపట్టడం తన పని కాదని, ఆ ప్రాధమిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది. లక్షలాది కుటుంబాలు తమ జీవనోపాధి కోసం నిర్మాణ, దాని అనుబంధ కార్యకలాపాలలో భాగస్వాములవుతున్నారని, నిర్మాణాలపై నిషేధం విధిస్తే తీవ్రమైన సామాజిక-ఆర్థిక పరిణామాలు సంభవిస్తాయని తెలిపింది.
నిర్మాణాలను నిషేధించలేం
- Advertisement -
- Advertisement -



