– బాలామృతంలో జొన్న రొట్టెలు
– వంద రోజుల ప్రణాళికను సిద్ధం చేయండి
– తల్లిదండ్రులకు భరోసా కల్పించేలా ఉద్యోగుల వేతనాల నుంచి వాటా
– రవాణా, దేవాదాయ, ఐటీ సహా వివిధ శాఖల్లో ట్రాన్స్జెండర్ల సేవలు : సంక్షేమ శాఖల సమీక్షలో
ముఖ్యమంత్రి రేవంత్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కంటైనర్ అంగన్వాడీల ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న అంగన్వాడీలు దేశానికే రోల్మోడల్గా నిలిచేలా వాటిని తీర్చిదిద్దాలని.. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు పౌష్టికాహారం అందించడంతోపాటు ఐదేండ్ల వరకు వారికి పూర్వ ప్రాథమిక విద్యను అందించి నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడాలని సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారిత శాఖలపై సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలకు నూతన భవనాలు నిర్మించే విషయంలో అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. పిల్లల అవసరాలకు అనుగుణంగా కంటైనర్లతో అంగన్వాడీలను డిజైన్ చేయించే అంశాన్ని అధ్యయనం చేయించాలని పేర్కొన్నారు. సోలార్ ప్లేట్లు, బ్యాటరీ బ్యాకప్తో కంటైనర్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే తక్కువ వ్యయం, ఎక్కువ సౌకర్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ అంశంపై ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న కంటైనర్ కేంద్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రతి పిల్లవాడికీ పౌష్టికాహారం అందించాలనీ.. ఇందుకు ఎన్జీవోల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. బాలామృతం ప్లస్ను పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. కర్ణాటకలో జొన్న రొట్టెలను వినియోగిస్తున్నారని, పౌష్టికాహార నిపుణులతో చర్చించి వాటిని మహిళా సంఘాలతో పిల్లలకు అందించే అంశంపైనా దృష్టి సారించాలని కోరారు. అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందజేత, వాటి పర్యవేక్షణ, నిర్వహణపై వంద రోజుల కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమం విషయంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు కలిసే పని చేయాలని సీఎం అన్నారు. అనాథ పిల్లలకు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తున్నారని, అదే సమయంలో ఏటీసీల్లోనూ వాళ్లకు ప్రవేశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మన పిల్లలను సింగపూర్లోని నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పంపే ఒప్పందం చేసుకున్నామని, అక్కడకు పంపే వారిలో అనాథ పిల్లలకు చోటు కల్పించాలని ఆదేశించారు. ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నిర్దేశిత సమయంలో అక్కడి పిల్లలకు ఆయా వాహనాల ద్వారా పౌష్టికాహారం అందేలా చూడాలని ఆదేశించారు. విశ్రాంత ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఆయా పిల్లలకు బోధన చేసేందుకు ఆసక్తి చూపితే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. తెలంగాణ ఫుడ్స్, విజయ డెయిరీ ఉత్పత్తులను అంగన్వాడీలకు అందేలా చూడాలని అన్నారు.
వృద్ధులకు భరోసా…
విశ్రాంత ఉద్యోగులైన వృద్ధులను వారి వారసులు పట్టించుకోవడం లేదని, అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలవాల్సి ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఉద్యోగుల వేతనాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాలకు 10-15 శాతం జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. అస్సాంలో ఇప్పటికే అలాంటి పథకం అమలవుతోందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇంకా అలాంటివి ఏవైనా ఉంటే పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్జెండర్లకు ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అవకాశం కల్పించామని, వారి సేవలను రవాణా, దేవాదాయ, వైద్యారోగ్య శాఖలతోపాటు ఐటీ, ఇతర కంపెనీల సేవల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు.
తెలంగాణ రైజింగ్లో…
తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్లో చిన్నారులు, మహిళలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షే మానికి తీసుకోవాల్సిన చర్యలపై విధానాలు రూపొందించాలని ముఖ్య మంత్రి అధికారులను ఆదేశించారు. వికలాంగుల మధ్య వివాహాలు, వివిధ పథకాల్లో వారికి ప్రోత్సా హకాలు కల్పించే విషయంపై అధ్యయనం చేసి రాబోయే క్యాబినెట్ సమావేశం నాటికి నివేదిక సమర్పిం చాలని ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన, మైనారిటీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, ట్రాన్స్జెండర్ల సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.