తొమ్మిదిమంది ఆస్పత్రిపాలు
బీజేపీ పాలిత రాష్ట్రంలో ఆగని ఘటనలు
భోపాల్ : ‘స్వచ్ఛ నగరం’గా అవార్డులు పొందిన మధ్యప్రదేశ్లోని ‘ఇండోర్’లో మరోసారి కలుషిత నీటితో ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. ఇండోర్ జిల్లాలోని మోవ్ తహసీల్లో కలుషిత నీరు తాగడంతో తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారని అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి పట్టి బజామ్ మరియు చందర్మార్గ్ ప్రాంతాల్లో కలుషిత నీటి కారణంగా సంక్రమించే వ్యాధుల కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఇండోర్ కలెక్టర్ శివం వర్మ మోవ్కుచేరుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, బాధిత ప్రాంతాల్లోని నివాసితులతో మాట్లాడారని ఒక అధికారి తెలిపారు. తొమ్మిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మరి కొందరు ఇళ్లలో కోలుకుంటున్నారని అన్నారు.
కొందరు ఆరోగ్య శాఖ సిబ్బంది సంఘటనా స్థలంలో పర్యటిస్తున్నట్లు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సిఎంహెచ్ఒ) ఒక ప్రకటనలో తెలిపారు. ఇండోర్ మెడికల్ కాలేజీ నుండి ఒక బృందం మరియు ఇతర వైద్య నిపుణులను కూడా ఆ ప్రాంతానికి పంపుతున్నామని అన్నారు. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. గత నెలలో, ఇండోర్లోని భగీరత్పుర ప్రాంతంలో అనేకమంది కలుషిత నీటితో అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కలుషిత నీరు ఇప్పటివరకు 25మంది ప్రాణాలను బలిగొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, ఐదునెలల బాలుడు సహా ఏడు మరణాలు నమోదయ్యాయని మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2026,జనవరి 15న హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
ఇండోర్లో మరోసారి కలుషిత నీరు
- Advertisement -
- Advertisement -



