– బిల్లులు చెల్లించాలని డిమాండ్
– గేట్ ఎదుట పెట్రోల్ డబ్బాతో బైటాయింపు
– స్కూల్ బయటే విద్యార్థులు, ఉపాధ్యాయులు
నవతెలంగాణ-ఖానాపూర్
పాఠశాల మరమ్మతులకు దాదాపు రూ.40లక్షలు ఖర్చు చేసినా ఇంతవరకు బిల్లు రాలేదని ఓ కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేశాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజుర గ్రామంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఎంసీ చైర్మెన్గా ఉన్న గడ్డం శ్రీనివాస్ దాదాపు రూ.40లక్షలు ఖర్చు చేసి డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, బాత్రూమ్, ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశాడు. ఇప్పటి వరకు బిల్లు రాకపోవడంతో సోమవారం ఉదయం పాఠశాలకు తాళం వేసి గేట్ ఎదుట పెట్రోల్ డబ్బాతో బైటాయించాడు. ఉపాధ్యాయులు, విద్యార్థులు బయటే వేచి ఉన్నారు. బిల్లులు చెల్లించే వరకు తాళం తీసేది లేదని కాంట్రాక్టర్ భీష్మించుకు కూర్చున్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అని పేరు మార్చి పాత బిల్లులు ఇవ్వడానికి ఇబ్బందులకు గురి చేస్తోందని బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎద్దులు, ట్రాక్టర్ అమ్మినా బాకీలు ముట్టలేదని, గ్రామంలో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుల వారు వేధిస్తున్నారని తెలిపాడు. పాఠశాల ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల తాళం తెరిచారు. ఈయనతోపాటు మరో కాంట్రాక్టర్ గణేష్ కూడా పాఠశాల అభివృద్ధికి డబ్బులు ఖర్చు చేశానని, ఇప్పటివరకు బిల్లులు రాలేదని తెలిపాడు. సంబంధిత ఏఈ ఎంబీలు ఇవ్వలేదని, ఇప్పటికైనా తమకు డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని జిల్లా అధికారులను కోరారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన కాంట్రాక్టర్ శ్రీనివాస్కు వెంటనే రూ.40లక్షల బిల్లు చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఆయనకు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు పుప్పాల గజేందర్తోపాటు పలువురు గ్రామస్తులు మద్దతుగా పాఠశాల గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES