– బీసీలకు విద్య, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు
– ఎస్సీ ఉపకులాల వర్గీకరణ
– దేశంలోనే మొదటగా తెలంగాణలో రెండు చారిత్రాత్మక నిర్ణయాలు
– 2028 నాటికి కోటి మంది మహిళలు కోటీశ్వరులు
– డ్రగ్స్ ఫ్రీ స్టేట్
– జూన్ 2 నుంచి యువతకు రూ.5 లక్షల స్వయం ఉపాధి పథకం ప్రారంభం
– తెలంగాణ రైజింగ్-2047 విజన్
– రాష్ట్రం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ : నిటి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ సమగ్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 2028 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే లక్ష్యమని ప్రకటించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద యువతకు రూ.5 లక్షల స్వయం ఉపాధి పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభిస్తామన్నారు. శనివారం న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో భారత మండపంలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నిటి ఆయోగ్ పదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వృద్ధిరేటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, రెండో, మూడో శ్రేణి నగరాల అభివృద్ధి వంటి వివిధ అంశాలపై చర్చించారు.
తెలంగాణ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం
జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదుల దారుణ చర్యకు వ్యతిరేకంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు రేవంత్ రెడ్డి.. మోడీకి, భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. 1971లో ఇందిరాగాంధీ నాయకత్వంలో పాకిస్తాన్ను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చిన చరిత్రను ఆయన గుర్తు చేశారు. 2047 నాటికి మన భారత దేశాన్ని సూపర్ పవర్గా, నెంబర్వన్గా నిలబెట్టాలన్న మోడీ సంకల్పాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. ‘వికసిత్ భారత్’ ప్రణాళికను రూపొందించడం అభినందనీయమన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందనీ, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని సీఎం అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్లోని నాలుగు కీలక అంశాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తామన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండిస్టియల్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసి కార్యాచరణలో పెట్టినట్టు రేవంత్రెడ్డి తెలిపారు.
కులగణనను స్వాగతిస్తున్నాం
అభివృద్దిలో, సంక్షేమంలో ఆయా వర్గాలకు న్యాయమైన వాటా ఇవ్వాలన్నదే తమ సంకల్పమన్నారు. అందుకే తెలంగాణలో సామాజిక, ఆర్ధిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన చేపట్టామని తెలిపారు. బీసీలకు విద్య, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ.. ఈ రెండు చారిత్రాత్మక నిర్ణయాలను దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ అమలు చేయడం గర్వంగా ఉన్నదని సీఎం తెలిపారు. దేశవ్యాప్త కులగణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కులగణనలో తెలంగాణ అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నదని ఆయన తెలిపారు.
మహిళలు, యువత కోసం కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర ఉండేలా విధానాలు రూపొందించినట్టు సీఎం చెప్పారు. మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు, మహిళా సంఘాలకు పాఠశాలల నిర్వహణ, శిల్పారామంలో 100 స్టాళ్లతో మహిళా బజార్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. సోలార్ పవర్ జనరేషన్లోనూ భాగస్వామ్యం కల్పించి మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ”మన దేశ భవిష్యత్తు మన యువత. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువతదే కీలక పాత్ర. అందుకే యువత ఆశయాల సాధనకు అనుగుణంగా యూత్ పాలసీ అమలు చేస్తున్నాం. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రయివేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టించాం” అని రేవంత్రెడ్డి తెలిపారు. ”ఒకవైపు మానవ వనరులకు డిమాండ్ పెరుగుతున్నా.. మరోవైపు నిరుద్యోగ సమస్య నెలకొంది. నైపుణ్యాల కొరతే ఈ అంతరానికి కారణమని గుర్తించాం. అందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరించి నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం” అని సీఎం వివరించారు.
డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా తెలంగాణ
తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటికి అడ్డుకట్ట వేయటంలో తెలంగాణ నెంబర్-1 స్థానం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రైతులు అప్పుల ఊబిలోకి జారకుండా పనిచేస్తున్నాం
దేశానికి రైతే వెన్నెముకనీ, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని సీఎం అన్నారు. రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణమనీ, వారిని అప్పుల ఊబి నుంచి బయటకు తేవడం, తిరిగి ఆ ఊబిలోకి జారిపోకుండా నిలబెట్టాలన్న లక్ష్యాలతో పని చేస్తున్నామన్నారు. ”తెలంగాణలో 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తులను చేశాం. సాగు కోసం రైతు మళ్లీ అప్పులపాలు కాకూడదన్న ఉద్దేశంతో ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా సాయం చేస్తున్నాం. బియ్యానికి మద్ధతు ధరకు అదనంగా క్వింటాల్కు రూ.500 చెల్లించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నాం. రైతుకు చేదోడుగా ఉండే వ్యవసాయ కూలీకి రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తున్నాం. ఈ రోజు వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది. గతేడాది 2.90 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచాం. ఈ నేపథ్యంలో రైతుల కోసం చేసే వ్యయాన్ని సంక్షేమ కోణంలో కాకుండా ఆహార సంపద సృష్టికి పెడుతున్న పెట్టుబడిగా చూడాలి” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ రైజింగ్-2047 విజన్
2047 నాటికి ఇండిస్టీ, ఇన్ఫ్రా విషయంలో అంతర్జాతీయ నగరాల సరసన తెలంగాణను నిలబెట్టే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణ రైజింగ్-2047 విజన్ను ఎంచుకున్నట్టు చెప్పారు. ఈ లక్ష్య సాధనలో తొలి అడుగుగా.. ఏడాదిన్నర కాలంలో అమెరికా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, దావోస్ (స్విట్జర్లాండ్) దేశాలలో పర్యటించి రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని అన్నారు.
మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్
తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామనీ, తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగాణగా విభజించి వృద్ధి సాధిస్తామన్నారు. తెలంగాణలో కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభాగాల్లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, మెట్రో రైల్ సెకండ్ ఫేజ్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మాన్యూఫాక్చరింగ్ హబ్, అగ్రిబేస్డ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. సబర్మతీ రివర్ ఫ్రంట్, గంగా పునరుద్ధరణ ప్రాజెక్ట్ మాదిరిగా తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందనీ, మెట్రో సెకండ్ ఫేజ్, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులు ప్రస్తుతం డీపీఆర్ల స్టేజ్లో ఉన్నాయని చెప్పారు. రేడియల్ రోడ్లు, తెలంగాణ ప్రతిపాదిత డ్రైపోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టుకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం రాష్ట్రాభివద్ధిలో కీలకమవుతాయన్నారు. గుడ్ గవర్నెన్స్తో అత్యున్నత ప్రమాణాలతో పౌర సేవలను అందిస్తామనీ, ఇందులో భాగంగా ‘బిల్డ్ నౌ’ యాప్ ద్వారా నిర్మాణ రంగానికి వేగం పెంచినట్టు సీఎం తెలిపారు.
డేటా సెంటర్ హబ్గా హైదరాబాద్
హైదరాబాద్ను డేటా సెంటర్ హబ్గా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. విద్య, వైద్యంలో అంతర్జాతీయ ప్రమాణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ”వికసిత్ భారత్ లక్ష్య సాధన మనందరి ఆశయం. అందులో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని మా ఆకాంక్ష. ‘నేషన్ ఫస్ట్ – పీపుల్ ఫస్ట్’ అన్న ప్రాధాన్యతతో ముందుకు వెళ్తున్నాం. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య. కేంద్రం సహాయ, సహకారం, మద్దతు లేకుండా తెలంగాణ రైజింగ్ విజన్ అమలు చేయలేం. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సహకరించండి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో ఉంటుందని మాట ఇస్తున్నాను” అని ముఖ్యమంత్రి చెప్పారు.
సమగ్రాభివృద్ధికిసహకరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES