Thursday, June 19, 2025
E-PAPER
Homeజాతీయంకొత్త ప్రాజెక్టులకు సహకరించండి

కొత్త ప్రాజెక్టులకు సహకరించండి

- Advertisement -

– అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్‌ భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. అమిత్‌ షాతో భేటీ అయిన మంత్రి లోకేష్‌ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఈ నెల 21న విశాఖలో ప్రధాని మోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్‌ షాకు అందజేశారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్‌ షా హామీ ఇచ్చినట్లు తెలిపారు.
జులై 5న జరిగే మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌ (పిటిఎం) కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను మంత్రి నారా లోకేష్‌ ఆహ్వానించారు. ఆగస్టులో విద్యాశాఖ మంత్రుల కాంక్లేవ్‌ ఏర్పాటుకు రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని లోకేష్‌ కోరగా, అందుకు ధర్మేంద్ర ప్రధాన్‌ అంగీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ.. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా టీచర్‌ బదిలీ చట్టం తెచ్చి సీనియారిటీ ప్రాతిపదికన ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు, బదిలీలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. మనబడి – మన భవిష్యత్తు కార్యక్రమంతో పిఎంశ్రీ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 125 ఆటిజం స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఉన్నత విద్య బలోపేతానికి యూనివర్సిటీల్లో ఏకీకృత చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. కెజి టు పిజి కరిక్యులమ్‌లో మార్పులు తెస్తున్నామన్నారు.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల అభివద్ధికి సహకరించండి
పండ్లతోటల అభివృద్ధికి అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఆ రంగంలో పెట్టుబడులకు సహకారం అందించాలని కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌కు మంత్రి లోకేష్‌ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ట్రిపుల్‌ ఐటిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా జులై 11, 12 తేదీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై అధ్యయనం చేద్దామని తెలిపారు. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌తోనూ మంత్రి లోకేష్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి సహకరించాలని కోరారు. లోకేష్‌ వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపిలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, సానా సతీష్‌, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కేశినేని శివనాథ్‌, బస్తిపాటి నాగరాజు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -