– కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో వైరస్ కలకలం
– గత 24 గంటల్లో ఏడుగురు మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నెల 25వ తేదీతో ముగిసిన వారంలో వెయ్యి మార్కుకు చేరుకున్న కేసుల సంఖ్య ఇప్పుడు 3,300 దాటేసింది. గత వారం రోజుల వ్యవధిలోనే వెయ్యి కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిన తాజా డేటా ప్రకారం…కేరళలో అత్యధికంగా 1,147 మంది కరోనా వైరస్ బారిన పడగా మహారాష్ట్రలో 424 మంది, ఢిల్లీలో 294 మంది, గుజరాత్లో 223 మంది బాధపడుతున్నారు. కర్నాటక, తమిళనాడులో 148 కేసుల చొప్పున నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్లో 116 మందికి కరోనా సోకింది. కొన్ని నెలల పాటు స్తబ్దుగా ఉన్న కరోనా వైరస్ ఇటీవలి కాలంలో విజృంభిస్తోంది. ఇన్ఫెక్షన్ల రేటు ఐదు రెట్లు పెరిగి మే 25తో ముగిసినవారంలో వెయ్యి మార్కును దాటింది. కరోనా బారినపడి గత 24 గంటల కాలంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ఈ సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 22కు చేరింది. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా కేసుల ప్రభావం చాలా వరకూ స్వల్పంగానే ఉంటోందని, భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కేరళలో కరోనా పరీక్షలు విస్తృత స్థాయిలో జరుగుతుండడంతో అక్కడ కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. మిజోరంలో ఏడు నెలల క్రితం ఓ కేసు నమోదైంది. తాజాగా రెండు కేసులు వచ్చాయి. కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడానికి ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8.1 ఒమిక్రాన్ వేరియంట్లు కారణమని భావిస్తున్నారు. అయితే దేశంలో జేఎన్.1 వేరియంట్ ప్రభావమే ఎక్కువగా కన్పిస్తోంది. కొత్త వేరియంట్లకు మనలోని రోగనిరోధక శక్తిని కొంత వరకూ తగ్గించే సామర్ధ్యం ఉన్నదని, అయితే అవి తీవ్రమైన దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్కు కారణమవుతాయని చెప్పడానికి ఆధారాలేవీ లేవని నిపుణులు అంటున్నారు. సాధారణ ఫ్లూ జ్వర లక్షణాలే కరోనాలో కూడా కన్పిస్తాయి. కరోనా సోకిన వారు జ్వరం, జలుబు, గొంతు నెప్పి, తలనోప్పి, అలసట, ఆయాసం వంటి లక్షణాలతో బాధపడతారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఆస్పత్రులలో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాయి. జన సంచారం ఎక్కువగా ఉండే చోటుకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాల్సిందిగా వృద్ధులు, సహ సంబంధమైన వ్యాధులు ఉన్న వారికి సూచిస్తున్నారు.
కరోనా కేసులు 3,300కు పైనే
- Advertisement -
- Advertisement -