న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గత 48 గంటల్లో 769 కొత్త కేసులు నమోదవ్వగా, ఆరుగురు మరణించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు వేలు దాటింది. అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా కేరళ కొనసాగుతోంది. ఆ తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆరోగ్య కేంద్రాల్లో వసతులను తనిఖీ చేయడానికి కేంద్రం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఆక్సిజన్, ఐసోలేషన్ బెడ్లు, వెంటిలేటర్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలని అన్ని రాష్ట్రాలకూ సూచించింది. దేశంలో ప్రస్తుతం 6,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చాలా కేసుల తీవ్రత స్వల్పంగా ఉన్నా యని, హోం క్వారంటైన్లోనే చికిత్స అందిస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. జనవరి నుంచి దేశంలో 65 మరణాలు నమోదయ్యాయి. కరోనా పరిస్థితికి అనుగుణంగా తగిన చర్యలను అంచనా వేయడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ సునీతా శర్మ అధ్యక్షతన జూన్ 2, 3 తేదీల్లో సాంకేతిక సమీక్ష సమావేశాలు నిర్వహించారు. విపత్తు నిర్వహణ విభాగం, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రెస్పాన్స్ సెల్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వాస్పత్రులు, అన్ని రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.