– వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు
– వారంలో గణనీయంగా పెరుగుదల
– ఏడు రోజుల్లో 752 కేసులు.. ఏడుగురు మృతి
– కేరళలో అత్యధికంగా 430 మంది వైరస్ బాధితులు
– ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ
– కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ సమాచారం
– భయాందోళనలు అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలి
– ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్
భారత్ను కరోనా మహమ్మారి మరోసారి కలవరానికి గురి చేస్తున్నది. దేశంలో యాక్టివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. గతవారం (మే 19న) ఈ కేసుల సంఖ్య 257గా ఉండటం గమనార్హం. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కేసులు పెరుగుతు ండటం ఆందోళనకరం.
న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 1009 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళ నుంచి అత్యధికంగా 430 ఉన్నాయి. గతవారం నుంచి ఇక్కడ 335 కేసులు పెరిగాయి. మహారాష్ట్ర (209 కేసులు) రెండో స్థానంలో ఉన్నది. ఇక్కడ వారం వ్యవధిలో 153 కేసులు పెరిగాయి. అలాగే, నాలుగు మరణాలు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 99 కేసులు పెరిగి ఆ సంఖ్య 104కు చేరింది. ఇక గుజరాత్ (83), తమిళనాడు (69), కర్నాటక (47), యూపీ (15), రాజస్తాన్ (13), పశ్చిమ బెంగాల్ (12), పుదుచ్చేరి (09), హర్యానా (09), ఆంధ్రప్రదేశ్ (04), మధ్యప్రదేశ్ (02), తెలంగాణ, గోవా, ఛత్తీస్గఢ్లలో ఒక్కటి చొప్పున నమోదైన కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, హిమాచల్ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లలో యాక్టివ్ కేసులు నమోదు కానట్టు సమాచారం. కాగా, కేసులు నమోదవుతున్నా.. భయపడాల్సిందేమీ లేదనీ, అయితే, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తున్నది.
భయాలు వద్దు..ప్రాథమిక జాగ్రత్తలు అవసరం : ఐసీఎంఆర్ చీఫ్
దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ స్పందించారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళనలు వద్దని అన్నారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పలు కీలక సూచనలు కూడా చేశారు. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవటం అవసరమని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ రోగులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మాస్కులు ధరించటం సహా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. పరిస్థితిని ప్రభుత్వ విభాగాలు గమనిస్తున్నాయన్నారు.
రెండు వేరియంట్లు గుర్తింపు
ఎన్బీ.1.8.1, ఐ.ఎఫ్.7 కోవిడ్ వేరియంట్లను దేశంలో గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. తమిళనాడులో ఏప్రిల్లో ఎన్బీ. 1.8.1 కేసు నమోదు కాగా.. మేలో ఐ.ఎఫ్.7 కు సంబంధించి నాలుగు కేసులను గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)… ఐ.ఎఫ్.8, ఎన్బీ.1.8 సబ్వేరియంట్ల ను ఆందోళనకర వేరియంట్లు (వీఓసీలు) లేదా వేరియంట్స్ ఆఫ్ ఇంటరెస్ట్ (వీఓఐలు)గా కాకుండా.. పర్యవేక్షణలో ఉండే వేరియంట్లు (వీయూఎంలు)గా వర్గీకరించింది. ఆసియా దేశాలలో హాంకాంగ్, సింగపూర్, థారులా ండ్తో పాటు చైనాలోనూ కొవిడ్-19 వ్యాప్తి తీవ్రంగా ఉన్నది. ఇక్కడ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఈ వేరియంట్లే చైనా, ఇతర ఆసియా ప్రాంతాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదల వెనుక ఉన్నట్టు తెలుస్తున్నది.