Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలువ్యవసాయాన్ని కబళిస్తున్న కార్పొరేట్ కంపెనీలు

వ్యవసాయాన్ని కబళిస్తున్న కార్పొరేట్ కంపెనీలు

- Advertisement -

– నాలుగింటి ఆధీనంలో విత్తనం, పురుగుమందులు

– సరళీకరణ విధానాల దుష్ప్రభావాలతో రైతు ఆత్మహత్యలు

– ధనిక దేశాల్లో రైతులకు సబ్సిడీ ఎక్కువ…మన దేశంలో తక్కువ

– ఉత్పత్తి ఖర్చు తగ్గించి ఎమ్‌ఎస్‌పీ నిర్ణయమా? నష్టపోతున్న రైతు

– అన్నదాతపై కరెంట్‌ మీటర్ల భారంమోపేందుకు కేంద్రం రెడీ

– రైతు భరోసా, రైతు బీమా కూడా మరణాలను ఆపలేకపోతున్నాయి

– అరిబండి ఫౌండేషన్‌, రైతు సంఘం సెమినార్‌లో విజ్జుకృష్ణన్‌

నవతెలంగాణ హైదరాబాద్: మన దేశంలో వ్యవసాయాన్ని నాలుగు కార్పొరేట్‌ కంపెనీలు వ్యవసాయ రంగాన్ని కబళిస్తున్నాయని ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విత్తనాలు, పురుగు మందులు ఆ కంపెనీల గుత్తాధితప్యంలో (46శాతం) బంధీ అవుతున్నాయని విమర్శించారు. అందుకఁ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. సరళీకరణ విధానాల(1990) ప్రభావం వ్యవసాయంపై పడిందన్నారు. సరళీకరణ విధానాలతో రైతులకు అనేక సౌకర్యాలు అందుతాయని నాటి పాలకులు నమ్మబలికారని తెలిపారు. కానీ ఆ తర్వాత దేశంలో రైతులు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎస్‌వీకే దొడ్డి కొమురయ్య హాల్‌లో అరిబండి ఫౌండేషన్‌, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ‘వ్యవసాయం రంగం- ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై అరిబండి ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సెమినార్‌లో విజూ కృష్ణన్‌ మాట్లాడారు. 30 ఏండ్లుగా సరళీకరణ విధానాలను అమలు చేయడం ద్వారా దేశంలో నాలుగున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో కౌలు రైతులు, కూలీలు, ఆదివాసీలు, మహిళా రైతులు ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనీ, స్వామినాథన్‌ కమిటీ సిఫారులను అమలు చేస్తామంటూ హామీ ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో అసలు ఆత్మహత్యలే లేవు అని చూపించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

ఉపాధి కూలీలకు ఏడాదికి రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని కోరుతుంటే, ఆ చట్టానికి బడ్జెట్‌లో నిధులు తగ్గించిందన్నారు. మరోవైపు విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరించే క్రమంలో కరెంట్‌ మోటార్లకు మీటర్లు బిగించాలని బీజేపీ పట్టుబడుతున్నదని విమర్శించారు. ఒక్కొక్క మీటర్‌కు రూ. 8వేల నుంచి 12 వేల భారం రైతులపై పడుతున్నదని చెప్పారు. వేల కోట్ల ఆస్తులు కలిగి, లాభాల్లో ఉన్న చంఢీఘర్‌ విద్యుత్‌ రంగాన్ని గోయంక కంపెనీకి అప్పగించిందని గుర్తు చేశారు. దీంతో రైతులపై అదనపు భారం పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు నిర్ణయించడంలో రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నదని విమర్శించారు. ఉత్పత్తి ఖర్చును తగ్గించి చూపించి, మద్దతు ధరలు నిర్ణయించడం కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో పత్తి సాగు 50 లక్షల ఎకరాల్లో పండుతున్నదనీ, మద్దతు ధరలు తక్కువగా నిర్ణయించడం వల్ల రైతులు ఏటా రూ.28వేల కోట్లు నష్టపోతున్నారని తెలిపారు. అందుకనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చిందని గుర్తు చేశారు. వాటికి వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో 380 రోజులపాటు సమరశీల ఉద్యమం జరిగిందన్నారు.

కేంద్రం దిగొచ్చి ఆ చట్టాలను రద్దు చేయడంతోపాటు రైతులకు క్షమాపణ చెప్పిందన్నారు. ఉద్యమంలో 736 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడు చట్టాలను కలిపి నూతన వ్యవసాయ మార్కెంటింగ్‌ విధానం పత్రాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. ధనిక దేశాల రైతులకు, ఇండియా రైతులకు సబ్సిడీలు ఇవ్వడంతో రైతుల మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. అందుకే విదేశాల నుంచి దిగుమతులు పెరగడంతో మన పంటలకు అధిక ధరలు రావడం లేదని చెప్పారు. ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌తో రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతున్నదని తెలిపారు. మలేషియా, థాయిలాండ్‌ దేశాల నుండి రబ్బర్‌ దిగుమతి కావడం వల్ల కేజీ రూ. 230 నుండి కేరళలో ఉత్పత్తి అవుతున్న రబ్బర్‌కు కేజీ రూ. 120 కు పడిపోయిందని అన్నారు. టైర్ల ధరలు మాత్రం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొండాలక్ష్మణ్‌బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ డి రాజిరెడ్డి మాట్లాడుతూ… వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలు వేయాలని సూచించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ కలిపి చేసే చోట రైతు లాభాసాటిగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో మల్టిపుల్‌ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పత్తి, వరి సాగు చేయడం వల్ల రైతులకు నష్టాలు వస్తున్నాయన్నారు. దీంతోపాటు కోతులు, పందులు, నెమళ్లు పంటలను దెబ్బతీస్తున్నాయన్నారు. ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

పంజాబ్‌ ప్రభుత్వ కార్యదర్శి అరిబండి వేణు ప్రసాద్‌ (రిటైర్డ్‌) వ్యవసాయాన్ని చేయడం అంత సులువు కాదన్నారు. పంజాబ్‌లో 1100 ఫీట్లు నుంచి నీటిని తోడి వరి పండిస్తున్నారని తెలిపారు. దీంతో రైతులకు పెద్ద ప్రయోజనం లేదన్నారు. దీనికి కరెంట్‌ వినియోగం కూడా ఎక్కువ ఉందన్నారు. అందుకే పంజాబ్‌లో రైతుఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ..‌. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ సమగ్ర ప్రణాళిక లేదని విమర్శించారు. ప్రణాళిక లేకపోవడంతో రైతులు తమకు ఇష్టం వచ్చిన పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. దీని వల్ల పంట నష్టాలు వచ్చి రైతులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్‌, అరిబండి పౌండేషన్‌ కార్యదర్శి అరిబండి మనోహర్‌, కోశాధికారి అరిబండి అనిల్, సభ్యులు అమర్‌నాథ్‌, అరిబండి ప్రసాదరావు భార్య ఝాన్సీ, కుటుంబ సభ్యులు, బంధువులు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -