న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం ప్రచారం ముమ్మరం చేసింది. ఆదివారం సమస్తిపూర్ జిల్లా విభూతిపూర్ అసెంబ్లీ స్థానంలోనూ, దర్భంగా జిల్లా హయాఘాట్ అసెంబ్లీ స్థానంలోనూ సిపిఎం భారీ ఎన్నికల బహిరంగ సభలను నిర్వహించింది. ఈ బహిరంగ సభల్లో పొలిట్బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, అభ్యర్థులు ఎమ్మెల్యే అజయ్ కుమార్, శ్యామ్ భారతి ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బిజెపి నియంత్రణలో పనిచేస్తోందని విమర్శించారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిందన్నారు. ఇండియా బ్లాక్ మద్దతుతో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి లాలన్ చౌదరి, సీనియర్ నేత అవధేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభురాజ్ నారాయణ రావు, సంజయ్ కుమార్, జిల్లా కార్యదర్శులు మంతు ఠాకూర్, మనోజ్ యాదవ్, రామశ్రరు మహతో, ఇతర మహాఘటబంధన్ నాయకులు పాల్గొన్నారు.



