థానే : మహారాష్ట్రలోని థానే-పాల్ఘర్ జిల్లాలో అమరవీరుల దినోత్సవాన్ని, కామ్రేడ్ గోదావరి పార్లేకర్ వర్ధంతిని నిర్వహించారు. జిల్లాలో అరుణ పతాకం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన 61మంది అమరవీరుల స్మృత్యర్ధం సీపీఐ(ఎం) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించింది. ఈ అమరవీరుల్లో చాలా మంది గిరిజనులే. వీరిలో ఐదుగురు వర్లి ఆదివాసి తిరుగుబాటులో మరణించారు. 1945లో బ్రిటిష్ హయాంలో పోలీసులు వారిని కాల్చివేశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వాడాలో నిర్వహించిన బహిరంగ సభకు దాదాపు 25వేల మంది హాజరయ్యారు. సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు డాక్టర్ అశోక్ ధావలె, మరియం ధావలె, కేంద్ర కమిటీ సభ్యులు, సీపీఐ(ఎం) మహారాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అజిత్ నవలె, కేంద్ర కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే వినోద్ నికొలె పలువురు రాష్ట్ర నేతలు బహిరంగ సభలో ప్రసంగించారు. వాడాలో కొత్తగా కట్టిన పార్టీ కార్యాలయానికి ప్రముఖ ఆదివాసీ నేత కామ్రేడ్ బర్క్యా మంగత్ పేరు పెట్టారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.