న్యూఢిల్లీ : సిబ్బంది నియామక ప్రక్రియలో ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ (ఎం) స్వాగతించింది. వికలాంగులు, మాజీ సైనికోద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. సుప్రీంకోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సీపీఐ (ఎం) పొలిట్బ్యూరో ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సుప్రీంకోర్టుకు చెందిన నాన్-జ్యుడీషియల్ సిబ్బందిలో ఎస్సీ, ఎస్టీ నియామకాలకు సంబంధించి రోస్టర్ పద్ధతిని ప్రధాన న్యాయమూర్తి అమలు చేయడం ఒక ముఖ్యమైన చర్య. నియామక నిబంధనలను సవరించేందుకు గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవారు చేపట్టిన చర్యను పార్టీ ప్రశంసిస్తోంది. ఇది నాన్-జ్యుడీషియల్ కోర్టు సిబ్బంది నియామకాల విషయంలో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న, ముఖ్యమైన సంస్కరణ. ఇప్పటి వరకూ సానుకూల పరిధిలో లేని రంగాలకు రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం చేకూర్చాలన్న దీర్ఘకాల డిమాండ్ను పాక్షికంగా నెరవేర్చడానికి తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగిన చర్యే’ అని సీపీఐ (ఎం) పొలిట్బ్యూరో ఆ ప్రకటలో తెలియజేసింది.