Tuesday, June 10, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అరెస్టు

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అరెస్టు

- Advertisement -

– రైతుల పరామర్శకు వెళ్తున్న నేతలను అడ్డుకున్న పోలీసులు
– అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలింపు
– అణచివేతతో ఉద్యమాలను ఆపలేరన్న వెస్లీ
– దాడికి పురిగొల్పిన యాజమాన్యంపై కేసుల్లేవంటూ విమర్శ
– ఇథ్‌నాల్‌ పరిశ్రమ ఏర్పాటు అనుమతులను ప్రభుత్వం రద్దుచేయాలని డిమాండ్‌


నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

ఇథనాల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని గద్వాల పట్టణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పన్నెండు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే తమకు నష్టం జరుగుతోందని, వెనక్కు తీసుకోవాలని కొంతకాలంగా పోరాడుతున్నారు. అయినా లెక్కచేయకుండా ప్రభుత్వం అదే పనిగా ముందుకు వెళుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు దాడికి దిగారు. ఈ ఘటనలో 42మంది రైతులపై అక్రమంగా నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు 12 మంది రైతులను అరెస్టు చేసి జైల్లో ఉంచారు. బెయిల్‌ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఆ రైతు కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పెద్ద ధన్వాడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారిని మార్గమధ్యలోనే అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.


అనంతరం జాన్‌వెస్లీ మీడియాతో మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలకు విరుద్ధంగా బలవంతంగా ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పూనుకుంటున్న యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడిందని గుర్తు చేశారు. అదే కాంగ్రెస్‌ పార్టీ దగ్గరుండి రైతులపై దాడులు చేయించి అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైలుపాలు చేస్తోందని విమర్శించారు. మంచి పంటలు పండే వ్యవసాయ అనుకూలమైన భూములను అక్రమంగా కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శించారు. పరిశ్రమ ఏర్పాటు వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడి ప్రజలు అనారోగ్యాల పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.


రాజోలి మండలంలో ఇండ్లు కోల్పోయిన ప్రజలకు సంబంధించిన ప్లాట్లను అక్కడే ఇచ్చారన్నారు. పరిశ్రమ ఏర్పాటు వల్ల వారు కూడా నిరాశ్రయులవుతారన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నియంతృత్వ వైఖరి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ప్రశ్నించినందుకు పరిశ్రమ యాజమాన్యం ప్రయివేటు బౌన్సర్లతో దాడులు చేయించిందనీ, మరి యాజమాన్యంపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మమ్మల్ని అడ్డుకుంటేనో ప్రజలను జైలుపాలు చేస్తేనో ఉద్యమాలు ఆగుతాయనుకోవడం ప్రభుత్వ అవివేకమని అన్నారు. తక్షణమే ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటు అనుమతులు రద్దుచేసి రైతులపై అక్రమ కేసులను ఎత్తివేసి వారిని జైలు నుంచి విడుదల చేయాలన్నారు.


లేనిపక్షంలో రైతులను ప్రజలను కలుపుకొని దీర్ఘకాల పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీరాం నాయక్‌ , జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు పరంజ్యోతి, ఈదన్న ఉన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అఖిల పక్ష నాయకులు నాగరొడ్డి వెంకట రాములు, అతికూర్‌ రెహమాన్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పరామర్శించారు.

జాన్‌వెస్లీ అరెస్టుకు సీపీఐ(ఎం) ఖండన: పోలీస్‌ పికెటింగ్‌ ఎత్తేయాలి
గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ గ్రామ శివారులో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న 12 గ్రామాల రైతులు, రిమాండ్‌లో ఉన్న బాధిత కుటుంబాలను పరా మర్శించేందుకు సోమవారం ఆ గ్రామానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతోపాటు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ శ్రీరాంనాయక్‌, గద్వాల జిల్లా కార్యదర్శి ఎ వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు వెళ్తున్న కారును పోలీసులు వెంబడిరచి, మధ్యలోనే అడ్డుకుని వారిని అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండించింది. గత వారం రోజులుగా పోలీస్‌ పికెట్లను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శించింది. మరియమ్మ అనే దళిత మహిళను పోలీసులు తీవ్రంగా కొట్టడమే కాకుండా, 46 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపింది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి నిర్బంధాలు రాష్ట్ర ప్రభుత్వానికి తగవని హెచ్చరించింది. గతంలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అనేక ఆందో ళనలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ, అధికారంలోకి రాగానే నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఫ్యాక్టరీ నిర్మా ణానికి పూనుకోవడం దుర్మార్గమని విమర్శించింది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల పంట పొలాలు దెబ్బతింటా యని ఆందోళన వ్యక్తం చేసింది. ఇథనాల్‌ కంపెనీ నిర్మాణాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. జైల్లో పెట్టిన రైతులను బేషరతుగా విడుదల చేయా లని కోరింది. గ్రామాల్లో పోలీస్‌ పికెటింగ్‌లు ఎత్తేసి, అక్రమ అరెస్టు లను ఆపాలనీ, మరియమ్మపై దాడి చేసిన పోలీ సులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -