ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన : కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గాజుల రామారంలోని మహారాజ గార్డెన్స్లో ఈ నెల 20 నుంచి 22 వరకు మూడ్రోజుల పాటు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 743 మంది ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానితులతో కలుపుకుని 1,000 మంది వరకు మహాసభలో పాల్గొంటారని తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటలకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుంచి మహాసభ వేదిక మహారాజ గార్డెన్స్ వరకు రెడ్ ప్లాగ్ మార్చ్ ఉంటుందనీ, 10 గంటలకు పార్టీ సీనియర్ నాయకులు కందిమళ్ల ప్రతాపరెడ్డి అరుణ పతాకాన్ని ఎగురవేస్తారనీ, అనంతరం నవ చేతన పబ్లిషింగ్ హౌజ్ ఏటుకూరి ప్రసాద్, అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఉదయం 11 గంటలకు మహాసభలను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్పాషా, సౌహార్ధ్ర ప్రతినిధులుగా సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ, సీపీఐ (ఎం) రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరు కానున్నారని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. మహాసభల ప్రాంతానికి ఏఐటీయూసీ సీనియర్ నాయకులు పోట్లూరి నాగేశ్వరావు నగర్గా, ఆ ప్రాంగణానికి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దివంగత ఎన్.బాలమల్లేష్ పేరును, భోజనశాలకు మేడ్చల్ జిల్లా నాయకులు దివగంత రోయ్యల కృష్ణమూర్తి, కె.సహాదేవ్ల పేర్లను పెట్టినట్టు వెల్లడించారు. మహాసభల్లో ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోనున్నట్టు తెలిపారు. మతోన్మాద, ఫాసిస్టు విధానాలను అనుసరిస్తున్న బీజేపీని గత ఎన్నికల్లో 240 సీట్లకు కట్టడి చేయడంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారని కూనంనేని తెలిపారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి భవిష్యత్తులో ఆ బీజేపీని మరింత కట్టడి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలను నెరవేర్చిందనీ, మరిన్ని హామీలను నెరవేర్చాల్సి ఉందన్నారు. ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించకపోవడం అప్రజాస్వామికమని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించే ప్రయత్నాలకు, అసంఘటిత కార్మికుల హక్కుల కోసం పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ (ఎం)తో పొత్తు ఉంటుందనీ, అదే విధంగా కాంగ్రెస్ తోనే స్నేహబంధం కొనసాగుతుందన్నారు. అత్యంత ప్రమాదకర పార్టీ బీజేపీని నిలువరించడమే తమకు ముఖ్యమన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధులకు తగిన గుర్తింపునిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్యపద్మ మాట్లాడుతూ మహాసభల్లో జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో దేశ, రాష్ట్ర రాజకీయాలు, ఉద్యోగ, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలు, ప్రజా సమస్యలపై లోతుగా చర్చించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఈటి నరసింహా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.జి. సాయిల్ గౌడ్, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎం.డి.యూసుప్, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్, కౌన్సిల్ సభ్యులు దామోదర్రెడ్డి పాల్గొన్నారు.
రేపటి నుంచి సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES