– 50 మందికిపైగా గాయాలు
– సరోజినీ ఆస్పత్రిలో చికిత్స
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దీపావళి పండుగను పురస్కరించుకుని టపాసులు కాల్చే క్రమంలో క్రాకర్స్ మిస్ఫైర్ వల్ల పలువురు గాయాలపాలయ్యారు. దీంతో సోమవారం రాత్రి నుంచి నగరంలోని సరోజినీ ఆస్పత్రికి గాయాలతో బాధితులు క్యూ కట్టారు. సోమ, మంగళవారాల్లో దాదాపు 50 మందికిపైగా బాధితులు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరినట్టు వైద్యులు వెల్లడించారు. వీరిలో 18 మంది వరకు చిన్నారులున్నారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. మిగిలిన వారిలో ఎక్కువ మందికి అవుట్ పేషెంట్గా చికిత్సనందించి పంపించారు. టపాసులు చేతిలో పేలడం, కండ్లలో ముక్కలు పడటంతో గాయాలు ఏర్పడినట్టు వైద్యులు తెలిపారు. దీపావళి పండుగ నేపథ్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనీ, ముఖ్యంగా సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం రాత్రి నుంచే ఆస్పత్రిలో అత్యవసర చికిత్స కోసం వచ్చిన వారి కోసం ఏర్పాట్లను సిద్ధం చేసి ఉంచారు. బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని వైద్యులు వెల్లడించారు.
క్రాకర్స్ మిస్ఫైర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES