పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది నోరూరించే స్నాక్స్ను ఎంతో ఇష్టపడతారు. అయితే అవి క్రిస్పీగా.. టేస్టీగా ఉంటేనే బోర్ కొట్టకుండా ఉంటుంది. సాయంకాలం పూట ఇలాంటి స్నాక్స్ చేసి ఇచ్చారంటే పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. అంతేకాదు వీటిని చాలా సులభంగానూ చేసుకోవచ్చు. మరి, ఈ కరకరలాడే సూపర్ టేస్టీ వంటకాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఆలూ బజ్జీ
తీసుకోవాల్సిన పదార్థాలు: ఆలూ – రెండు, శనగపిండి – ఒక కప్పు(100 గ్రాములు), బియ్యప్పిండి – టేబుల్ స్పూన్లు, కారం – అరటీస్పూను, పసుపు – పావుటీస్పూను, అల్లం పేస్ట్ – అరటీస్పూను, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, వాము – అరటీస్పూను, జీలకర్ర – కొద్దిగా(ఆప్షనల్), ఉప్పు – రుచికి సరిపడా, వంటసోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకి తగినంత.
తయారీ విధానం: ముందుగా రౌండ్గా ఉండే ఆలూ తీసుకొని పీలర్తో చెక్కు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి చాకుతో రౌండ్ షేప్లో సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని రంగు మారకుండా నీళ్లు ఉన్న ఒక గిన్నెలోకి తీసుకొని ఒకటికి రెండుసార్లు చక్కగా వాష్ చేసుకోవాలి. కడిగిన ఆలూ ముక్కలను అదే గిన్నెలో ఉంచి తగినన్ని నీళ్లు పోసి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పసుపు, అల్లం పేస్ట్, సన్నని కొత్తిమీర తరుగు, వాము, జీలకర్ర, ఉప్పు, వంటసోడా వేసుకొని అన్ని కలిసేలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని నీరు పోసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి. మరికొద్దిగా నీటిని పోకుంటూ పిండి ముద్దలు లేకుండా బజ్జీలకు కావాల్సినట్టు కాస్త జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో తగినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక ఆలూ ముక్కలలోని నీరు వడకట్టి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో చక్కగా డిప్ చేసి కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా క్రిస్పీగా, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే ఆలూ బజ్జీలు రెడీ!
చిట్టి పునుగులు
కావాల్సిన పదార్థాలు: రేషన్ బియ్యం – కప్పు, ఆలూ – మూడు, ఉప్పు – రుచికి సరిపడా, పచ్చిమిర్చి – రెండు, కొత్తిమీర తరుగు – కొద్దిగా, జీలకర్ర – స్పూను, నూనె – వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: ఓ బౌల్లోకి బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి సుమారు మూడు గంటల పాటు నానబెట్టాలి. బియ్యం నానేలోపు ఆలుగడ్డలను మెత్తగా ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచాలి. బియ్యం నానిన తర్వాత మరోసారి కడిగి నీళ్లను పూర్తిగా వంపేసుకోవాలి. మిక్సీజార్లోకి నానిన బియ్యం వేసుకుని వీలైనంత మెత్తగా కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఓ బౌల్లోకి తీసుకోవాలి. అదే మిక్సీజార్లోకి ఉడికించి కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ను బియ్యప్పిండి మిశ్రమంలో కలుపుకోవాలి. బియ్యప్పిండిలోకి ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, జీలకర్ర వేసి ఇవన్నీ పిండిలో కలిసేలా మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా ఉండకుండా కాస్త గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. పిండిని పునుగులు వేసుకునేందుకు అనుగుణంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక చేతిని తడుపుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పునుగుల మాదిరిగా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో వాటిని రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా వేయించుకోవాలి. అయితే ఇవి మామూలు పునుగుల మాదిరి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావు. కాస్త వైట్ కలర్లోనే ఉంటాయి. కాబట్టి పునుగులు ఉడికి లైట్గా కలర్కు మారిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని పునుగులుగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఓ ప్లేట్లోకి తీసుకుని ఉల్లిగడ్డ, టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలు.
ఎగ్ లాలీపాప్స్
కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు – నాలుగు, ఉప్పు – రుచికి సరిపడా, గరం మసా లా – అర టీస్పూను, కారం – అర టీస్పూను, మిరియాల పొడి – పావు టీస్పూను, ఉల్లిగడ్డ – ఒకటి, పచ్చిమిర్చి – రెండు, అల్లం తురుము – టీ స్పూను, వెల్లుల్లి తురుము – టీస్పూను, కార్న్ఫ్లోర్ – అర టీస్పూను, కొత్తిమీర తరుగు – కొద్దిగా, బ్రెడ్ స్లైస్లు – తగినన్ని.
తయారీ విధానం: ముందుగా కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసుకోవాలి. గ్రేటర్ సాయంతో ఎగ్స్ను సన్నగా తురుముకోవాలి. అలాగే ఇందులోకి అవసరమైన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఓ బౌల్లోకి తురుముకున్న ఎగ్ మిశ్రమం, ఉప్పు, గరం మసాలా, కారం, మిరియాల పొడి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి తరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కార్న్ ఫ్లోర్మిశ్రమం, కొత్తిమీర తరుగు వేసి మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన ఉంచాలి. ఓ గిన్నెలోకి ఒక కోడిగుడ్డును పగలగొట్టి, చిటికెడు ఉప్పు వేసి సుమారు 5 నిమిషాలు పాటు బీట్ చేయాలి. మిక్సీజార్లోకి బ్రెడ్ స్లైస్లను తుంపి వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకుంటే బ్రెడ్ పౌడర్ రెడీ. బాల్స్గా చేసు కున్న ఎగ్ మిశ్రమాన్ని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి, ఆపై బ్రెడ్ పౌడర్ను అద్ది పక్కన ఉంచాలి. బాల్స్ అన్నింటిని ఇలానే చేసుకోవాలి.
స్టవ్ ఆన్చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న బాల్స్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వెంటనే గరిటెతో కలపకుండా కాస్త కలర్ మారిన తర్వాత నిధానంగా కలుపుతూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఎగ్ బాల్స్ మంచిగా వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇలానే కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్కు టూత్పిక్ గుచ్చి టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఎగ్ లాలీపాప్స్ రెడీ.
తంజావూర్ తవల వడ
కావాల్సిన పదార్థాలు: బియ్యం – అర కప్పు, శనగపప్పు – అర కప్పు, కందిపప్పు – అర కప్పు, మినపప్పు – అర కప్పు, పెసరపప్పు – అర కప్పు, ఎండుమిర్చి – నాలుగు, పచ్చిమిర్చి – నాలుగు, అల్లం – కొద్దిగా, కరివేపాకు – కొద్దిగా, ఇంగువ – పావు టీస్పూను, నెయ్యి – టేబుల్ స్పూను, ఆవాలు – అర టీస్పూను, కొబ్బరి తురుము – కప్పు, ఉప్పు – రుచికి తగినంత.
తయారీ విధానం: ఓ గిన్నెలోకి బియ్యం, మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు, కొద్దిగా పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి సుమారు మూడు గంటల సేపు నానబెట్టాలి. అలాగే మరో గిన్నెలోకి మిగిలిన పెసరపప్పు వేసి దాన్ని క్లీన్ చేసి మూడు గంటలు నానబెట్టాలి. పప్పులు నానిన తర్వాత మరోసారి కడిగి జల్లెడలో వేసి నీటిని వడకట్టాలి. మిక్సీజార్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులోకే వడకట్టిన పప్పుల మిశ్రమాన్ని వేసి నీరు కలపకుండా మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఓ బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత ఆవాలు వేసి ఫ్రై చేసుకుని పిండి లో కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి ఇంగువ, పచ్చికొబ్బరి తురుము, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన పెసరపప్పును నీళ్లు లేకుండా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. పిండిని కొద్దిగా తీసుకుని వడ ఆకారంలో తయారు చేసుకుని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసు కోవాలి. వడలు వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసు కోవాలి. ఇలా మిగిలిన పిండి మొత్తాన్ని వడలుగా చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన తంజా వూర్ తవల వడ రెడీ. దీన్ని కొబ్బరి చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.