కొంత మంది ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. కానీ, విమర్శలు, అవమానాలను మాత్రం తట్టుకోలేరు. ఇలాంటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో జరుగుతుంటాయి. కొంతమంది తమ ఆనందం కోసం ఎదుటివారిని విమర్శిస్తే… ఇంకొంతమంది వారి లోపాలను తెలియజేయడానికి విమర్శిస్తుంటారు. మరికొంతమంది తమ ప్రతిభ, అహంకారాన్ని చాటుకోవడానికి ఇతరులను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తుంటారు. ఇవి ఎదుటివ్యక్తి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. కనుక ఇతరుల నుండి ఇలాంటివి ఎదురైనప్పుడు వాటి నుండి జాగ్రత్తగా బయటపడాలి.
మనలోని లోపాలను సరిదద్దడానికే విమర్శిస్తే వాటి వల్ల మనకు ఎలాంటి నష్టం ఉండదు. పైగా వాళ్లు మన మంచిని కోరుకునే వారని మనం అర్థం చేసుకోవాలి. అవి మన భవిష్యత్తుకు కూడా మంచిది. కనుక ఆ విమర్శను స్వీకరించి మనలో రావల్సిన మార్పుపై దృష్టి పెట్టాలి. అదే కావాలనే పనిగట్టుకొని విమర్శిస్తే మాత్రం వాటిని పట్టించుకోవల్సిన అవసరం లేదు. అయితే ఇలా వదిలేయండా అనేది మాటల్లో చెప్పినంత తేలిక కాదు. సాధారణంగా మనల్ని ఇతరులు అవమానపరిస్తే చెప్పలేనంత కోపం, బాధ కలుగుతుంటాయి. వాటికి వెంటనే బదులు తీర్చుకోవాలనుకోవడం సహజం. కానీ, ఆవేశంలో ప్రతిస్పందించినప్పుడు సమస్య మరింత పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దానివల్ల ఎలాంటి పరిష్కారం దొరకదు. కాబట్టి, మొదట మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఆ తర్వాత వారికి సున్నితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాలి.
కొంత మంది ఎదుటి వారి చేతలను గమనిస్తూ వారిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి వారు వారిలోని లోపాలను మాత్రం గురివింద సామెతలా అస్సలు చూసుకోరు. అదే సమయంలో కొందరైతే తమ అహంకారాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు. వీరికి ఎదుటి వ్యక్తి బాధపడతారన్న ఆలోచన కూడా ఉండదు. ఇలాంటి వారితో ఎంత సానుకూలంగా ఉన్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉండటమే చక్కటి పరిష్కారం.
అయితే అందరూ మనల్ని బాధపెట్టాలన్న ఉద్దేశంతోనే విమర్శలు చేయరు. కొంతమంది మీ లోపాలను సరిదిద్దాలనే ఉద్దేశంతో కూడా విమర్శించే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి వారిలో మీకు అత్యంత సన్నిహితులు, శ్రేయోభిలాషులు మాత్రమే ఉంటారు. ఇలాంటి వారు విమర్శలు చేసినప్పుడు గట్టిగా సమాధానం చెప్పకుండా వారితో ఒకసారి చర్చించడం మంచిది. కనుక మీ ప్రవర్థన, మీలో ఉండే లోపాల గురించి మీకు తెలియచేసి వారు మిమ్మల్ని సరిదిద్దాలనుకుంటున్నారేమో తెలుసుకోవడం మంచిది.
ఏ సమస్యకైనా సానుకూల ధోరణే సరైన పరిష్కారం. అయితే అన్ని సందర్భాల్లోనూ సానుకూలంగా ఉండడం కష్టమే. ముఖ్యంగా మనల్ని ఎవరైనా ఏదైనా విషయంలో అనవసరంగా విమర్శించినప్పుడు, అవమానించినప్పుడు విపరీతమైన కోపం రావడం సహజం. కానీ, అలాంటి సందర్భాల్లోనే మన వ్యక్తిత్వం బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి సంర్భాల్లో సాధ్యమైనంత వరకు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ కోపాన్ని నియంత్రించుకోవడం అవసరం.
విమర్శ
- Advertisement -
- Advertisement -