నవతెలంగాణ-కమ్మర్ పల్లి
దసరా సెలవులు ముగిసిన వేళ చదువుల నిమిత్తం పట్టణాలకు వెళ్లే విద్యార్థులు, ఇతర పనుల నిమిత్తం వెళ్లే ప్రజలతో మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆదివారం కిక్కిరిసిపోయింది. సెలవులు ముగిసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రయాణం చేసేందుకు బస్టాండ్ కు చేరుకోవడంతో కమ్మర్ పల్లి బస్టాండ్ లో ఎటు చూసినా ప్రజలే దర్శనమిచ్చారు. సెలవులు ముగిసిన వేళ ప్రజల ప్రయాణాలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు సరైన బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బస్సుల కోసం గంటల కొద్ది వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడపాదనకు వచ్చిన ప్రతి బస్సు కిక్కిరిసి ఫుట్ బోర్డు వరకు ప్రయాణికులు ఉండడంతో ఎక్కెందుకు స్థలం లేక ప్రజలు అవస్థలు పడ్డారు. ఎలాగోలా వచ్చిన బస్సును ఎక్కకపోతే మళ్ళీ బస్సు ఎప్పుడు వస్తాదో అన్న ఆందోళనతో బస్సు ఎక్కెందుకు పోటీ పడడంతో ఒకరికొకరు తోసేసుకునే పరిస్థితి ఏర్పడింది. పండుగలను ఆర్టీసీ అధికారులు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల అవస్థలను పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. పండుగ సెలవులు ముగిసిన నేపథ్యంలో ప్రజల అవసరాల మేరకు బస్సుల్ని ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆర్టీసీ అధికారుల తీరుపై అసహన వ్యక్తం చేశారు.
కిక్కిరిసిన బస్టాండ్… బస్సుల కోసం పడిగాపులు
- Advertisement -
- Advertisement -



