మైన్స్ శాఖ నుంచి నోటీసు రాలేదు
రూ.2.75 కోట్ల సీనరేజీ ఫీజు చెల్లింపు
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబం కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు
ఎమ్మెల్యే ఆరోపణలకు రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ గ్రామంలో అక్రమ మైనింగ్, క్రషింగ్ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలంటూ మైన్స్ అండ్ జియాలజీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని కోరిన ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపణలను రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఖండించింది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్ డి నిరంజన్రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా పొంగులేటి ప్రసాద్రెడ్డి, డైరెక్టర్గా తాను ఉన్నామని వివరించారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఈ కంపెనీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.
మైన్స్ అండ్ జియాలజీ శాఖ నుంచి తమ కంపెనీకి ఎలాంటి నోటీసులు తమ కార్యాలయానికిగానీ, ప్రతినిధులకుగానీ అందలేదని వివరించారు.
కొత్వాల్గూ డలో స్వయంగా ఎలాంటి క్రషర్ను ఏర్పాటు చేయలేదనీ, నిర్వహించలేదని తెలిపారు. తిరుమల మెటల్ ఇండిస్టీ సంస్థతో 2024, నవంబర్ 12న ఒప్పందం ప్రకారం రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ క్రషర్ను లీజు పద్ధతిలో తీసుకుని క్రషింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. విద్యుత్ కనెక్షన్ తిరుమల మెటల్ ఇండిస్టీ యజమాని పి మల్లికార్జున కుమార్ పేరు మీద నాన్ డొమెస్టిక్ వినియోగం కోసం పొందారని వివరించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ నిర్వహించిన పనుల పరిమాణాన్ని అంచనా వేసి రూ.2.75 కోట్లు కట్ చేసి గతేడాది డిసెంబర్ ఎనిమిదిన మైన్స్ అండ్ జియాలజీ శాఖకు జమ చేశామని వివరించారు. రంగారెడ్డి జిల్లా మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నోటీసులు తమ కార్యాలయానికి రాలేదని తెలిపారు.
పీసీబీకి మైన్స్ శాఖ లేఖలు రాసిందంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారనీ, అక్కడ మైనింగ్, క్రషింగ్ కార్యకలాపాలతో రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఈ వాస్తవాలను పరిశీలిం చకుండా మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకున్న చర్యలు అనవసరమైనవని పేర్కొన్నారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత నోటీసులు తప్పుదారి పట్టించే సమాచారాన్ని సృష్టించి తమ ప్రతిష్టకు తిరుగులేని నష్టం కలిగించాయని తెలిపారు. సీనరేజీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని అధికారులను కోరారు.



