నవతెలంగాణ-గంభీరావుపేట: విద్యార్థులకు సులభమైన పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలని, అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని అన్ని తరగతి గదులు, వంటగదిని స్వయంగా తిరిగి పరిశీలించారు.
పాఠాలు బోధిస్తూ… ప్రశ్నలు అడిగి.. సమాధానాలు రాబట్టి
7,8,9,10 తరగతులలోని విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, హిందీ పాఠాలను బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు హిందీ టెక్స్ట్ బుక్ లోని పాఠ్యాంశాన్ని చదవలేకపోవడం గమనించి టీచర్ పై అసహనం వ్యక్తం చేశారు. భవనం పైకప్పు లీకేజీ కాకుండా మరమ్మత్తు చేయించాలి.విద్యాలయం గదుల్లోకి దోమలు, పురుగులు, పాములు రాకుండా కిటికీలను రిపేర్, మెష్ లు ఏర్పాటు చేయించాలని, వాటర్ లీకేజీలు, బిల్డింగ్ మీద నీరు నిల్వకాకుండా రూఫ్ లీకేజీ కాకుండా మరమ్మత్తు (వాటర్ ప్రూఫ్ఫింగ్) చేయించాలని అధికారులకు సూచించారు.
విద్యాలయం, సిబ్బంది క్వార్టర్స్ ఆవరణలోని పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ సెక్రటరీ ని ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని సూచించారు. అన్ని పాఠ్యాంశాలపై విద్యార్థులకు పట్టు వచ్చేలా మెరుగైన రీతిలో బోధించాలని ఆదేశించారు. మరో 15 రోజుల్లో విద్యాలయానికి మళ్లీ వస్తానని, తనిఖీ చేస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ సిరిసిల్ల ఆర్డిఓ వెంకటేశ్వర్లు తాసిల్దార్ ఎంపీడీవో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.