సేవల నిలిపివేత..విమాన సర్వీసులకు ఆటంకం
సరిచేసేందుకు శ్రమిస్తున్న సాంకేతిక బృందాలు
హీత్రో: లండన్లోని హీత్రో, బెల్జియంలోని బ్రసెల్స్, జర్మీనీలోని బెర్లిన్ సహా పలు యూరోపియన్ విమానాశ్రయాలు సైబర్దాడికి గురయ్యాయి. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. సైబర్ నేరగాళ్లు సర్వీస్ ప్రొవైడర్లను లక్ష్యంగా చేసుకోవడంతో చెక్-ఇన్, బోర్డింగ్ వ్యవస్థలు వంటి సేవలు నిలిచిపోయినట్టు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ సేవల్లో అంతరాయం నెలకొనడంతో అనేక విమానాలు ఆలస్యం కాగా.. పలు విమానాలు రద్దయినట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో వివిధ దేశాలకు వెళ్లాల్సిన వేలాదిమంది ప్రయాణికులపై ప్రభావం పడింది. విమానాల స్థితిని తెలుసుకోవడానికి సంబంధిత వెబ్సైట్లను పరిశీలిస్తూ ఉండాలని విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు సూచించారు. సైబర్ దాడి కారణంగా బ్రసెల్స్ విమానాశ్రయంలోని ఆటోమేటెడ్ చెక్-ఇన్, బోర్డింగ్ సేవలు పనిచేయడం లేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సిస్టమ్ను సరిచేసేందుకు తమ సాంకేతిక బృందం శ్రమిస్తోందని..త్వరలో సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఇప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. యూరప్లోని దాదాపు అన్ని ప్రఖ్యాత విమానాశ్రయాలు సైబర్ దాడికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. సిస్టమ్ ప్రొవైడర్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల విమానాలు ఆలస్యమవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి.