Sunday, March 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్యాస్‌ కేవైసీ అప్‌డేట్‌ పేరిట సైబర్‌ మోసాలు

గ్యాస్‌ కేవైసీ అప్‌డేట్‌ పేరిట సైబర్‌ మోసాలు

- Advertisement -

ఏపీకే ఫైల్స్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే ఖాతాలు ఖాళీ
నవతెలంగాణ-సిటీబ్యూరో

గ్యాస్‌ కనెక్షన్‌ కేవైసీ అప్‌డేట్‌, అత్యవసర గ్యాస్‌ బుకింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లుసరికొత్త మోసాలకు తెరలేపారు. గ్యాస్‌ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని, నేరగాళ్లు అమాయక ప్రజల ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని డోంబివాలి ప్రాంతంలో జరిగిన ఓ ఘటనతో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ”ప్రముఖ గ్యాస్‌ కంపెనీ ప్రతినిధులమని చెబుతూ సైబర్‌ నేరగాళ్లు ఇద్దరు మహిళలకు ఫోన్‌ చేశారు.

గ్యాస్‌ కనెక్షన్‌ సమాచారంతో పాటు కేవైసీని వెంటనే అప్‌డేట్‌ చేయాలని నమ్మించి, వాట్సాప్‌లో ఒక ఏపీకే ఫైల్‌ పంపారు. ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసి అందులో ఉన్న ఫారం నింపాలని సూచించారు. ఆ మహిళలు వారు చెప్పినట్లే యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి వివరాలు నమోదు చేయగానే, వారి బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు మాయం అయ్యాయి.” ఇలాంటి మోసాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని నగర పోలీసులు సూచించారు.

క్లిక్‌ చేస్తే నియంత్రణ కోల్పోతాం
కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ వాట్సాప్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా వచ్చే గుర్తుతెలియని లింక్‌లను క్లిక్‌ చేయడం, వారు పంపే ఏపీకే ఫైల్స్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేయడం చాలా ప్రమాదకరమని పోలీసులు తెలిపారు.. నేరగాళ్లు పంపే ఏ చిన్న యాప్‌లనైనా డౌన్‌లోడ్‌ చేస్తే చాలు, మొబైల్‌ నియంత్రణ మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. దాని ద్వారా ఫోన్‌కు వచ్చే బ్యాంక్‌ ఓటీపీలు, రహస్య మెసేజ్‌లు నేరుగా సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతాయి.

సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి
గ్యాస్‌ బుకింగ్‌ లేదా కేవైసీ అప్‌డేట్‌ కోసం గ్యాస్‌ కంపెనీలకు చెందిన అధికారిక యాప్స్‌, వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలని పోలీసులు సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయానికే వెళ్లి సంప్రదించడం సురక్షితమని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఎవరైనా సైబర్‌ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930 కి కాల్‌ చేయాలని, లేదా కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్‌ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌
సైబర్‌ నేరగాళ్లు సరికొత్త పద్దతిలో రెచ్చిపోతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. తక్షణమే గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సోషల్‌ మీడియాలో వచ్చే నకిలీ ప్రకటనలను నమ్మవద్దని సీపీ కోరారు. ముందుగా డబ్బులు చెల్లిస్తేనే గ్యాస్‌ వస్తుందని నమ్మబలికే సందేశాలు వస్తే, అవి కచ్చితంగా సైబర్‌ మోసాలేనని గుర్తించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -