నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు పది రోజులు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. అంతేకాదు, వేగంగా కదులుతూ మూడు రోజుల్లోనే అన్ని జిల్లాలకూ విస్తరించాయి. ఋతుపవనాల ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతాయని IMD పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు మరింతగా బలపడిందని ఐఎండీ తెలిపింది. ఉత్తర దిశగా కదులుతోందని, రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని హెచ్చరించింది.
ఈ వాయుగుండం క్రమంగా తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇప్పటికే అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో చెదురు ముదురు వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి 40-50 కి.మీ. వేగంతో ఎదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇవాళ శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, వరదలు, పిడుగుల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించింది.