హర్యానా డీజీపీ, చీఫ్ సెక్రెటరీ, ఎస్పీలను డిస్మిస్ చేయాలి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
హర్యానాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కులవివక్ష వల్లే చనిపోయారని, ఆయన మరణ వాంగ్మూలం ఆధారంగా హర్యానా డీజీపీ, చీఫ్ సెక్రెటరీ, ఎస్పీలను తక్షణమే డిస్మిస్ చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి హైదరాబాద్లోని ఓయూలో కేవీపీఎస్, ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘పూరన్ కుమార్ మృతి-వ్యవస్తీకృత హత్య’ అనే అంశంపై ఎస్ఎఫ్ఐ ఓయూ ప్రెసిడెంట్ అజరు కుమార్ అధ్యక్షతన నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. కులవివక్ష అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విచారకరమని, ఈ ఘటన పై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారిస్థాయిలో ఉన్న దళితుడికే ఇంత అవమానం జరిగితే.. సామాన్య దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనువాద సిద్ధాంతం పేరుతో సమాజాన్ని విషతుల్యం చేస్తున్నాయని, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పు విసిరిన సంగతి మరవకముందే హర్యానాలో ఐపీఎస్ మృతి దేశంలో అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అవమానాలు ఏమిటో చెబుతుం దన్నారు. టీపీఎస్కే రాష్ట్ర కన్వీనర్ జి.రాములు మాట్లాడుతూ.. ఐపీఎస్ అధికారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడాలని కోరారు. ప్రధాని ఈ ఘటనపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం ముసుగులో దళితులపై దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట పూరన్ కుమార్కు కొవ్వొత్తులతో నివాళ్లర్పించారు. ఈ కార్య క్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆర్ఎల్ మూర్తి, యూనివర్సిటీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తూటి మహేందర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉప్పల ఉదయ్ కుమార్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంద నవీన్, ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేదాంత్ మౌర్య, ఎస్ఎస్యూ ఓయూ ప్రెసిడెంట్ నవీన్, ఎస్ఎఫ్ఐ, వివిధ సంఘాల నాయకులు శ్రీను, కిరణ్, ఆసీఫ్, సురుచి, మౌనిక, మొక్షిత, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.