మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు
నవతెలంగాణ- హైదరాబాద్
నిజాయితీకి, విలువలకు మారుపేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని మాజీ ఎంపీ , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు. ఆయన జీవితాన్ని నేటితరం ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దామోదరం సంజీవయ్య 105వ జయంతిని పురస్కరించుకుని.. .అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి, అనంతరం సంజీవయ్య పార్క్లో ఆయన సమాధి వద్ద మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్తో కలిసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ…దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ దామోదరం సంజీవయ్యకు అవకాశం కల్పించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్లో దామోదరం సంజీవయ్య పుట్టి పెరిగిన చోట స్మతి వనం నిర్మించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలకు ఆయన పేరు గుర్తుండిపోయేలా కర్నూల్ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని కోరారు. గతంలో స్మతి వనం కోసం పవన్ కళ్యాణ్ రూ. కోటి ప్రకటించారని తెలిపారు. ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నందున ఇచ్చిన హామీ మేరకు స్మృతి వనం నిర్మించి కర్నూల్ జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని కోరారు.



