ఆయన జీవిత చరిత్ర ఆవిష్కరణలో వక్తలు
‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకాన్ని
ఆవిష్కరించిన మాజీ రాష్ట్రపతి కోవింద్
ముఖ్య అతిథులుగా తెలంగాణ, ఏపీ సీఎంలు
ఐదు రాష్ట్రాల గవర్నర్లు, ఇద్దరు కేంద్ర మంత్రులు, పలువురు తెలంగాణ, ఏపీ మంత్రులు హాజరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిద్ధాంత పరంగా ఎన్ని అభిప్రాయభేదాలున్నా తన వ్యక్తిత్వం ద్వారా అన్ని పార్టీల నేతలను కలుపుకునిపోయే దత్తాత్రేయ అందరివాడనీ, ఆజాత శత్రువని వక్తలు ముక్తకంఠంతో కొనియాడారు. అన్ని పార్టీల నేతలను అలరు..బలరు ద్వారా ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఒరవడి దత్తాత్రేయతో సాధ్యమైనందని చెప్పారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’ జీవిత చరిత్రను ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. అనంతరం కోవింద్ మాట్లాడుతూ..ప్రజల కోసం దత్తాత్రేయ తన జీవితం సాగించాడని కొనియాడారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయనకు శత్రువుల్లేరనీ, అందరూ హితులేనని చెప్పారు. ఏపీ, తెలంగాణ తనకు రెండో ఇల్లు లాంటివని తెలిపారు. 1994 నుంచి దత్తాత్రేయతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కనీస వేతనం, కనీస పెన్షన్, ఈఎస్ఐ ఆస్పత్రుల బలోపేతం తదితర పథకాల రూపకల్పనలో దత్తాత్రేయ కృషి మరువలేదనీ, ఆయన కార్మికులకు ఎంతో మేలు చేశారని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలుండే దక్షిణ భారతం నుంచి సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే హిమాచల్ ప్రదేశ్లో గవర్నర్గా పనిచేయడమంటేనే ప్రజాసేవ పట్ల ఆయనకున్న చిత్తశుద్దేంటో అర్థమవుతుందన్నారు.
బూతులు మాట్లాడేవారికి బూతుల్లోనే బుద్ధి చెప్పండి : ఎం.వెంకయ్యనాయుడు
ఉన్న విషయాలు, నిజాలు చెప్పాలి కాబట్టి తాను జీవితచరిత్రను రాయదల్చుకోలేదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చలోక్తి విసిరారు. దత్తాత్రేయ ఎప్పుడూ గంజి మనిషేననీ, బెంజి మనిషిగా మారలేదని చెప్పారు. పదవుంటే హంగూఆర్భాటాలు చేయడాన్ని తప్పుబట్టారు. డైపర్లను మార్చినట్టు పదవుల కోసం పార్టీలు మారే ధోరణి శ్రేయస్కరం కాదన్నారు. రాజకీయాల్లో బూతులు మాట్లాడేవారిని బూతుల్లోనే (పోలింగ్ కేంద్రాలు) ఓటు ద్వారా బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అర్థవంతమైన రాజకీయ విమర్శలు ండాలనీ, అయితే, అవి సంస్కారహీనంగా లేకుండా చూసుకోవాలని నాయకుల్ని కోరారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు.
జెంటిల్మెన్కు ప్రతిరూపం దత్తాత్రేయ : చంద్రబాబు నాయుడు
జెంటిల్మెన్కు ప్రతిరూపం బండారు దత్తాత్రేయ అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ రోజుకు ఇక్కడకు రాగానే పాతరోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలపై సీఎంలకు లేఖలు రాసిరాసీ లేఖల రాయుడికి అంబాసిడర్గా మారారని చలోక్తి విసిరారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి కోసం సైబరాబాద్ను నిర్మించామనీ, ఇప్పుడివన్నీ చూస్తుంటే ఎంతో తృప్తి కలుగుతోందని చెప్పారు. తెలుగు జాతికి చరిత్రలో ప్రత్యేక స్థానముంద న్నారు. పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశ దశదిశను మార్చారని కొనియాడారు.
గల్లీ నుంచి గవర్నర్గా ఎదిగినా దత్తన్న ప్రజల మనిషే : ఎ. రేవంత్రెడ్డి
గౌలిగూడ గల్లీ నుంచి గవర్నర్గా ఎదిగినా దత్తన్న ఎప్పుడూ ప్రజల మనిషే అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి కొనియాడారు. దత్తాత్రేయ, కిషన్రెడ్డి కుటుంబాలతో తనకు సత్సంబంధాలున్నాయని చెప్పారు. ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పుడు..’మీ స్కూళ్లో చదివా. కాలేజీ చంద్రబాబు దగ్గర చేశా, ఉద్యోగం రాహుల్గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా’ అంటూ తన రాజకీయ ప్రస్తావనాన్ని గుర్తుచేసుకున్నారు. జాతీయ స్థాయిలో వాజ్పేయికున్న గౌరవం రాష్ట్ర రాజకీయాల్లో దత్తాత్రేయకు ఉందని కొనియాడారు. అలరు.. బలరు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలి చిందని గుర్తుచేశారు. హైదరాబాద్ జంట నగరాల ప్రజల గుండెల్లో పీజేఆర్, దత్తన్న ఎప్పటికీ నిలిచి ఉంటారనీ, ఇప్పుడు అలాంటి నేతలు రావడంలేదని చెప్పారు. అభివృద్ధి విషయంలో తనతో కిషన్రెడ్డి కలిస్తే రాష్ట్రం మరింత ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజకీయాలు వృత్తి, వ్యాపారం కాదు..సమాజ సేవ కోసం : దత్తాత్రేయ
రాజకీయాలంటే వృత్తి, వ్యాపారం కాదనీ, సమాజ సేవ కోసమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నొక్కి చెప్పారు. తాను రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి మనోహర్ షిండే, వి.రామారావు, బంగారు లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి కారణమని చెప్పారు. తాను ఇంట్లో కంటే ఎక్కువగా ప్రజలు, కార్యకర్తల ఇండ్లలోనే తిన్నాననీ, వారే తన ఆస్తి అని తెలిపారు. ఆర్ఎస్ఎస్ తన ప్రాణమని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ..హైటెక్ సిటీ అంటే అందరికీ గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడేనన్నారు. అందర్నీ ఆత్మీయంగా పలుకరించే వ్యక్తి దత్తాత్రేయ అని కొనియాడారు. అలరుబలయ కమిటీ చైర్మెన్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజర్, ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బి.శ్రీనివాసవర్మ, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఏపీ మంత్రి సత్యకుమార్, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ.రమణ, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి, ఎమ్మెస్కో అధినేత విజరుకుమార్, పాల్గొన్నారు.
రేవంత్రెడ్డీ.. అలాంటి మహానుభావులు ఏం సహాయం చేస్తారు? కిషన్రెడ్డిపై రాజాసింగ్ పరోక్ష విమర్శలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ తన విమర్శల దాడిని ఎక్కుపెడుతూనే ఉన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుం దంటూ వ్యాఖ్యానించారు. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ… ‘సీఎం రేవంత్రెడ్డీ.. మీరు సహాయం అడుగుతున్న వారికి చెవులు ఉన్నా వినపడవు. నోరు ఉన్నా చెప్పరు. చేతులున్నా సహాయం చేయరు. అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారు?’ అంటూ సోషల్మీడియా వేదికగా విమర్శలు చేశారు. పరోక్షంగా ఈ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపైనే రాజాసింగ్ చేసినట్టు అర్థమవుతున్నది.
దత్తాత్రేయ అందరివాడు..అజాత శత్రువు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES