కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో సుదీర్ఘ చర్చ
సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్లతో ప్రత్యేకంగా భేటీ
రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న అధిష్టానం
సమర్థులకే ఈ పదవులు : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కసరత్తు తుది అంకానికి చేరింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అనంతరం సామాజిక న్యాయం, సమర్థులైన వారికి డీసీసీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఢిల్లీలోని ఇందిరా భవన్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్… సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్లతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి దాదాపు రెండు గంటల పాటు డీసీసీ ఎంపిక, రాష్ట్రంలోని తాజా అంశాలపై కేసీ ప్రత్యేకంగా చర్చించారు. తొలుత సీఎం రేవంత్రెడ్డితో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్లతో వన్ టూ వన్ సమావేశాలు చేపట్టారు. కాగా.. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, సంఘటన్, సృజన్ అభియాన్ పురోగతి, జిల్లా స్థాయి నాయకత్వ మార్పులపై విశ్లేషణాత్మక చర్చలు జరిపారు. ప్రధానంగా రాష్ట్రంలో మొత్తం 35 డీసీసీలకు, 4 కార్పొరేషన్లకు అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇందుకోసం దాదాపు నెలకుపైగా చర్చ సాగుతోంది. ఈ ఎంపికపై ఏఐసీసీ నియమించిన 22 మంది పరిశీలకులు సైతం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఒక్కో డీసీసీ పదవికి ముగ్గురు పేర్లను సూచించారు. ఈ జాబితాను తాజాగా ఏఐసీసీ పరిశీలకులు అధిష్టానానికి సమర్పించారు. ఈ జాబితాతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ అభిప్రాయాలను కేసీ వేణుగోపాల్ అడిగి తెలుసుకున్నారు. తద్వారా ఎలాంటి వివాదాలూ లేని పలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఖరారు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఫైనల్ చేసిన పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ జాబితాను ఒకటి, రెండు రోజుల్లో పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా తెలంగాణలోని ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలు, మంత్రుల మధ్య విభేదాలు, పార్టీ అంతర్గత అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. వీటితో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, లోకల్ బాడీ ఎన్నికలపై హైకోర్టు స్టే, మంత్రివర్గ విస్తరణ, ఇతర అంశాలను కేసీకి సీఎం వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఇతర పదవుల్లో ఉన్న వారికి అవకాశం లేదు : పీసీసీ చీఫ్
సమర్థులైన వారినే డీసీసీ అధ్యక్ష పదవులకు ఎంపిక చేస్తామని పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే ఈ పదవుల ఎంపికలోనూ సామాజిక న్యాయం ఉంటుందని చెప్పారు. కనీసం పార్టీలో ఐదేండ్లు పనిచేసిన వారే ఈ పదవికి అర్హులని నిబంధన పెట్టినట్టు వెల్లడించారు. డీసీసీల నియామకాల్లో అందరి అభిప్రాయాలను అధిష్టానం తీసుకుంటుందన్నారు. ఇప్పటికే జిల్లాల అధ్యక్షులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సమర్థవంతమైన వారిని డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తామని అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. అలాగే ఇతర పదవుల్లో ఉన్నవారికి డీసీసీ పదవి ఇవ్వకూడదనే నిబంధన ఉందని చెప్పారు.
త్వరలో డీసీసీ అధ్యక్షుల ప్రకటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



