– ట్రాలీ ఆటో ఢీకొనడంతో కాలుకి తీవ్ర గాయాలు
– చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు
– మళ్లీ స్పృహ తప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి
– కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఘటన
నవతెలంగాణ-నిజాంసాగర్/ఎల్లారెడ్డి
ట్రాలీ ఆటో ఢీకొని చిన్నారికి గాయాలు కాగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. మళ్లీ స్పృహ తప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ విషాధ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్ఐ శివకుమార్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ గ్రామానికి చెందిన మేదరి మధురశ్రీ (3) ఇంటి ముందర కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన ట్రాలీ ఆటోలో ఇంటికి వస్తుండగా.. మధురశ్రీ ఆకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చి ట్రాలీ ఆటో కింద పడింది. ఆటో వెనుక చక్రం బాలిక కాలు మీద నుంచి వెళ్లడంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి పట్టణంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి చికిత్స చేసి.. మందులు రాసిచ్చి ఇంటికి పంపారు. ఇంటి వద్ద సంబంధిత వైద్యులు రాసిచ్చిన సిరప్ తాగించిన అనంతరం బాలిక స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు మళ్లీ ఎల్లారెడ్డిలోని అదే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి చిన్నారి అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. బాలిక తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలిక మృతిచెందడంతో ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
మూడేండ్ల చిన్నారి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES