Thursday, June 26, 2025
E-PAPER
Homeఆటలుపరాజయం స్వయంకృతం

పరాజయం స్వయంకృతం

- Advertisement -

– పస లేని బౌలింగ్‌, పేలవ ఫీల్డింగ్‌
– లీడ్స్‌ టెస్టులో ఐదు శతకాలు వృథా

ఓ టెస్టులో ఐదు శతకాలు. టాప్‌-5 బ్యాటర్లు జోడించిన పరుగులు 780. ఏ పరిస్థితుల్లోనైనా విజయానికి ఇవి చాలు. అయినా, లీడ్స్‌ టెస్టులో టీమ్‌ ఇండియా 5 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. 148 ఏండ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఐదు సెంచరీలు సాధించినా ఓడిన జట్టుగా భారత్‌ చెత్త రికార్డును మూటగట్టుకుంది. బ్యాటింగ్‌ ఫైర్‌ పవర్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా వరల్డ్‌క్లాస్‌ పేస్‌ జతకలిసినా.. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌ పైచేయి సాధించింది. అందుకు కారణం ఇంగ్లాండ్‌ మెరుగ్గా ఆడటం ఎంతమాత్రం కాదు. టీమ్‌ ఇండియా స్వయంకృతమే. లీడ్స్‌ టెస్టులో 80 శాతం గిల్‌ సేన ఆధిపత్యం చెలాయించినా.. భారత్‌ ఓటమి చవిచూసింది.
శ్రీనివాస్‌ దాస్‌ మంతటి

టెస్టు క్రికెట్‌ను జీవితానికి అన్వయిస్తారు. ఎందుకంటే జీవితంలో, టెస్టు మ్యాచ్‌లో ఏవైనా పొరపాట్ల దిద్దుబాటుకు మరో అవకాశం లభిస్తుంది. రెండో అవకాశం సద్వినియోగం చేసుకుంటే విజయం తథ్యం. లీడ్స్‌ టెస్టులో టీమ్‌ ఇండియా రెండు అవకాశాలను వృథా చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 430/3తో ఉన్న ఇన్నింగ్స్‌ ఒక్కసారిగా 471/10తో ముగిసింది. 41 పరుగులకే చివరి ఏడు పతనం అయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో 333/4తో ఉన్న ఇన్నింగ్స్‌ను 364/10గా ముగిసింది. ఈసారి 31 పరుగులకే చివరి ఆరు వికెట్లు కుప్పకూలాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు అవకాశం చేజారగా.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం వృథా అయ్యింది. ఫలితంగా, లీడ్స్‌ టెస్టులో ఏ దశలోనూ ఫేవరేట్‌గా కనిపించని ఇంగ్లాండ్‌ ఆఖరు రోజు విజేతగా నిలిచింది. శుభ్‌మన్‌ గిల్‌ స్వయంకృతమే ఇందుకు కారణం.
లోయర్‌ ఆర్డర్‌ పతనం
లీడ్స్‌ టెస్టులో భారత్‌ చేసిన పరుగులు 835 (471, 364). రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు సెంచరీలు నమోదయ్యాయి. యశస్వి జైస్వాల్‌ (101), శుభ్‌మన్‌ గిల్‌ (147), రిషబ్‌ పంత్‌ (134, 118), కెఎల్‌ రాహుల్‌ (137) చారిత్రక శతకాలు బాదారు. అయినా, భారత్‌ పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 430/3తో భారీ స్కోరు దిశగా సాగుతున్న ఇన్నింగ్స్‌.. ఒక్కసారిగా కుప్పకూలింది. 41 పరుగులకే చివరి ఏడు వికెట్లు పతనం అయ్యాయి. లోయర్‌ ఆర్డర్‌లో శార్దుల్‌ ఠాకూర్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణలు కేవలం 16 పరుగులే జోడించారు. భారత రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇదే కథ పునరావృతం అయ్యింది. 333/4తో ఇంగ్లాండ్‌కు రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు భారీ కుదుపు. 31 పరుగులకే ఆఖరు 6 వికెట్లు కుప్పకూలాయి. టెయిలెండర్లు మరోసారి నిరాశపరిచారు. 2004 సిడ్నీ టెస్టులో భారత టాప్‌-5 బ్యాటర్లు 781 పరుగులు చేయగా.. ఆ తర్వాత లీడ్స్‌లో 780 పరుగులతో మెరిశారు. కానీ టెయిలెండర్లు రెండు ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు ఆశలను ఆవిరి చేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఆఖరు-5 భాగస్వామ్యాల నుంచి 55 పరుగులే వచ్చాయి. ఈ గణాంకాల్లో భారత్‌కు ఇదే అత్యల్పం. లోయర్‌ ఆర్డర్‌ పతనంతో ఇంగ్లాండ్‌ శిబిరంలో ఉత్సాహం వచ్చింది. ఊహించిన స్కోరు కంటే తక్కువ పరుగులకే భారత్‌ను పరిమితం చేసి మానసికంగా ఆతిథ్య జట్టు ఒత్తిడిని తొలగించుకుంది.
పేలవ ఫీల్డింగ్‌, చేజారిన క్యాచ్‌లు
క్యాచ్‌లను జారవిడిస్తే మ్యాచ్‌ చేజారినట్టే. లీడ్స్‌లో భారత్‌కు సరిగ్గా ఇదే జరిగింది. భారత్‌ ఆరు క్యాచ్‌లు నేల పాలు చేయగా.. అందులో నాలుగు యశస్వి జైస్వాల్‌ వదిలేశాడు. పేలవ ఫీల్డింగ్‌, చేజారిన క్యాచ్‌లతో ఇంగ్లాండ్‌ ఓ 200 పరుగులు ఖాతాలో వేసుకుంది. ఒలీ పోప్‌ (106), హ్యారీ బ్రూక్‌ (99) సహా బెన్‌ డకెట్‌ (149) పేలవ ఫీల్డింగ్‌తో లబ్ది పొందారు. క్యాచ్‌లు నేల పాలు కావటంతో సహజంగానే ఇంగ్లాండ్‌ బ్యాటర్లపై ఒత్తిడి తగ్గింది. బ్యాటింగ్‌ లైనప్‌పై ఒత్తిడి లేకపోవటంతో పరుగుల వేట సులభతరమైంది. చెత్త ఫీల్డింగ్‌తోనే తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆధిక్యం 6 పరుగులకు కుదించబడింది. లేదంటే, మూడంకెల ఆధిక్యం దక్కించుకునేది.
పస లేని బౌలింగ్‌
తొలి ఇన్నింగ్స్‌లో జశ్‌ప్రీత్‌ బుమ్రా (5/83) ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ పడగొట్టలేదు. మరో ఎండ్‌ నుంచి బుమ్రాకు సరైన సహకారం లోపించింది. ఇది బుమ్రా ప్రభావాన్ని గణనీయంగా తగ్గించింది. ఇంగ్లాండ్‌ 371 పరుగుల ఛేదనలో పేసర్లు, స్పిన్నర్లు తేలిపోయారు. రవీంద్ర జడేజా పిచ్‌పై అచ్చులను ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదు. ప్రసిద్‌ కృష్ణ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. మహ్మద్‌ సిరాజ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రాలను సరైన సమయంలో ప్రయోగించలేదు. ఐదో రోజు పిచ్‌పై బంతిపై మెరుపు ఉన్నప్పుడు, మెరుపు తగ్గిన తర్వాత కూడా పేసర్లు ప్రభావం చూపించలేదు. బజ్‌బాల్‌ దూకుడుతో వేగంగా పరుగులు సాధించిన ఇంగ్లాండ్‌.. భారత బౌలర్లనే ఒత్తిడిలోకి పడేసింది.
గిల్‌ నాయకత్వ వైఫల్యం
శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే తేలిపోయాడు. మ్యాచ్‌లో అతడు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన వ్యూహంపై విమర్శలు వస్తున్నాయి. ఛేదనలో బుమ్రా, సిరాజ్‌ను ప్రయోగించే అంశంలో గిల్‌ వ్యూహంపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 41-81 ఓవర్లలో మహ్మద్‌ సిరాజ్‌కు ఒక్క ఓవర్‌ ఇవ్వలేదు. ఇదే సమయంలో బెన్‌ డకెట్‌ స్పిన్‌పై విరుచుకుపడగా.. రవీంద్ర జడేజా ఓ ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేశాడు. ఐదో రోజు చివరి సెషన్లో బుమ్రా అసలు బంతి అందుకోలేదు. ఆఖరు వరకు పోరాడే తత్వాన్ని గిల్‌ విస్మరించాడు. చివరి 17 ఓవర్లలో బుమ్రాకు ఒక్క ఓవర్‌ కూడా ఇవ్వలేదు.
ఇప్పుడెలా?
భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదు టెస్టుల సిరీస్‌లో గిల్‌సేన అందివచ్చిన విజయాన్ని వదిలేసింది. అయినా, సిరీస్‌లో పుంజుకునేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్‌ లైనప్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటం భారత్‌కు అతిపెద్ద అనుకూలత. బుమ్రా ప్రతి మ్యాచ్‌లో ఆడకపోయినా.. అతడు ఆడిన ప్రతి టెస్టులో విజయావకాశాలు సృష్టించగల సమర్థుడు. సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, జడేజాలు వికెట్ల వేటలో బాధ్యత తీసుకోవాల్సి అవసరం ఉంది. లోయర్‌ ఆర్డర్‌ భారీ స్కోర్లు చేయకపోయినా.. పేకమేడను తలపించే పతనాన్ని అధిగమిస్తే సరిపోతుంది. ఫీల్డింగ్‌, క్యాచుల అంశంలో భారత్‌ సీరియస్‌గా చెమటోడ్చాలి. నాయకుడిగా గిల్‌ సైతం నిర్ణయాలు తీసుకోవటం, అమలు చేయటం సహా డిఆర్‌ఎస్‌ కోరే అంశంలో పరిణితి చూపించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -