ఈ రోజు అనుకున్న రంగంలో సక్సెస్ సాధించిన వారందరూ గతంలో ఓటమి చెందిన వారే. అదీ పరీక్ష అయినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, జీవితమైనా.. ఏదైనా సరె మొదట్లో ఫెయిలవడం సహజం. ఫెయిల్ తర్వాతే సక్సెస్, ఓటమి వెనుకే గెలుపు దాగి ఉంటుందనే సత్యాన్ని నేటి విద్యార్థులు అర్థం చేసుకోవాలి. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో చాలామంది రాణించారు. కొంతమంది వెనుకబడ్డారు. అయినంత మాత్రాన జీవితమేమి పరిసమాప్తం కాదు. ఎన్నో అవకాశాలు ఉంటాయి.మరెన్నో పరీక్షల్లో మనం ఉత్తీర్ణత కావచ్చు. దానికి కావాల్సింది. కుంగిపోవడం కాదు, పట్దుదలగా ప్రయత్నించడం.జీవితంలో పరీక్షలు చిన్న భాగం మాత్రమే, పరీక్షలే జీవితంకాదు, ప్రపంచ ధనవంతుల్లో కొందరు కేవలం పాఠశాల వరకే చదివారనే విషయం గుర్తుంచుకోవాలి, ఉదాహరణకు బిల్ గెట్స్ ప్రపంచ కుబేరుడు. కానీ పెద్ద చదువులేమీ చదవలేదు. విరాట్కొహ్లీ, సచిన్ టెండుల్కర్ కూడా కేవలం పదోతరగతే చదివారు. కాని వారనుకున్న రంగాల్లో విజయం సాధించి ప్రపంచం గుర్తించే విధంగా పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు.బిల్స్గేట్స్ ఓ సందర్భంలో నాకన్న ఎక్కువ చదివినవారు, నన్ను మించిన వారు కూడా నా కంపెనీలోనే జాబ్ చేస్తున్నారని చెప్పారు.దీనర్థం, చదువంటే కేవలం ర్యాంకులే కాదు, మేధస్సు అని.బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్, అబ్రహం లింకన్, ఐన్స్టీన్, ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉదాహరణలున్నాయి.
చదువులో రాణించలేనివారు వేరే రంగంలో సాధించి చూపారు, ప్రపంచం గుర్తించేలా ఎదిగారు.ఈనాటి పరీక్షలు అధికశాతం విద్యాసంస్థలు పరీక్షలంటే కేవలం మార్కులే అని భ్రమలో ఉన్నారు, ఇదే విద్యార్థులపైనరుద్ది వారికి ఇదే వాస్తవమని అబద్దపు ప్రపంచంలో నెడుతున్నారు. మొదటి ర్యాంకు రావాలి, కళాశాలకు పేరు రావాలని ఒత్తిడికి గురిచేస్తూ బాగా చదివే మిగితా విద్యార్థులతో పోల్చుతూ హేళ నగా చూడడంతో కొందరు విద్యార్థులు ఒత్తిడికి గురైకుంగిపోతున్నారు, భట్టీ అవగాహన లేని చదువులతో అధిక మార్కులతో, పాస్ సర్టిఫికెట్తో సాధించేదేమి లేదు. గతంలో ఇలా ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెచ్చిన వారు, జిల్లా స్థాయిలో టాపర్గా నిలిచిన వారు కూడా, ఇంటర్లో పాసై తర్వాత ఎంసెట్, నీట్ లాంటీ ఎన్నో పోటీ పరీక్షల్లో కనీస మార్కులు కూడా సాధించలేకపోయిన ఎన్నో ఉదాహరణలున్నాయి. ముఖ్యంగా కార్పోరేట్ కళాశాలల విద్యార్థుల పైనే అధిక ఒత్తిడి ఉంటుంది, ఆయా కళాశాలల ప్రచారానికి, వారి వ్యాపారం కోసం పేరు ప్రఖ్యాతల కోసం అధిక ఒత్తిడికి విద్యార్థులు బలవుతున్నారు, దానికి తోడు తల్లి తండ్రులు కూడా కళాశాలల మాదిరే ఇతర విద్యార్థులతో పోల్చుతూ వారి పిల్లలపై లేని పోని టార్గెట్ పెట్టి పిల్లల జీవితంలో ఒక భాగమైన చదువుల కోసం వారి జీవితాలనే నాశనం చేస్తున్నారు, ఈరోజు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కుంగిపోవడం, నిరాశకు గురై ఆత్మహత్యలు లాంటి ఆలోచనలు పిరికి వారికే తప్పా ధైర్యవంతులకు రావు. సమస్యలను అధిగమించాలనే తపన ఉన్నవారు, భవిష్యత్ లక్ష్యం పెట్టుకున్న వారు సముద్రంలాగా శాంతంగా ఉంటారు. సరైన సమయంలో కెరటాలె వలే ఎగిసి పడతారు, సాధించే వరకు ఓపికతో ఉండడమే అసలు విజయానికి మార్గం.
ఓటమి చెందడం ఒక విధంగా మంచిదే, ఇదే గెలుపుకు నాంది. ఒకసారి ఓడితేనే భవిష్యత్ సమస్యలను సాధించే గుణాన్ని నేర్చు కుంటారు. ధైర్యవంతులుగా తయారవుతారు, వారిలో మరొకసారి ఓడిపోద్దనే తపన, కసి పెరుగుతుంది, మానసికంగా ఎదుగుతారు, మానసిక నిపుణులు కూడా ఇదే చెబుతారు, పదవ తరగతి లేదా ఇంటర్మీడియెట్లో ఒకసారి ఫెయిల్ అయిన వారే భవిష్యత్తులో అన్నింట్లో సక్సెస్ అవుతారని,చరిత్రలో విజయాలను సాధించిన వారి కొందరి జీవితాలను చదివితే అది నిజమనే అర్ధమవుతుంది,పరీక్షల ఫలితాల సమయంలో ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో గడపాలి, మార్కులు తక్కువొచ్చినా లేదా ఫెయిల్ అయిన సరే, వారికి ధైర్యం ఇచ్చి మానసిక బలాన్ని అందించే విధంగా వ్యవహరించాలి. విద్యార్థులు కూడా పట్టుదలతో ధైర్యంగా ఉండి సాధిస్తామనే ఆత్మవిశ్వాసం ప్రదర్శించాలి. కానీ నిరాశకు గురి కాకూడదు, నెగెటివ్ ఆలోచన కాకుండా ప్రతిసారి పాజిటివ్ ఆలోచనలతో కష్టపడితే విజయం మీ సొంతమవుతుంది. నిరాశ మనిషిని నిలువునా చీల్చుతుంది, ఆశ జీవితాలను నిలబెడుతుంది.
సయ్యద్ జబీ
ఓటమే..గెలుపునకు నాంది!
- Advertisement -
RELATED ARTICLES