Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబుద్ధవనంలో ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులు

బుద్ధవనంలో ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులు

- Advertisement -

శ్రీలంక మంత్రి హెనిడుమ సునీల్‌ సెనెవి
సబ్‌ కలెక్టర్‌, బుద్ధవనం ప్రత్యేకాధికారి స్వాగతం
నవతెలంగాణ-నాగార్జునసాగర్‌

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులు శనివారం సందర్శించారు. హైదరాబాద్‌లో ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సులో పాల్గొని విజయ విహార్‌ అతిథి గృహానికి వచ్చిన శ్రీలంక బుద్ధ శాసన మత సాంస్కృతిక శాఖ మంత్రి హెనిడుమ సునీల్‌ సెనెవికు మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ అమిత్‌, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, టూరిజం హోటల్స్‌ జనరల్‌ మేనేజర్‌ నాదన్‌, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌ రాజు స్వాగతం పలికారు. అనంతరం 22 దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, బౌద్ధ భిక్షువులు, బౌద్ధ నిపుణులు బుద్ధవనం చేరుకున్నారు. ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులకు టిబెట్‌ సంప్రదాయ పద్ధతిలో వాయిద్యాలతో స్వాగతం పలికారు. బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం మహా స్తూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించారు.

అనంతరం తెలంగాణ టూరిజం లాంచీలో నాగార్జునకొండ మ్యూజియం ను సందర్శించారు. మ్యూజియం క్యూరేటర్‌ కమలహాసన్‌ వారికి వివరించారు. నాగార్జున కొండపై పునర్‌నిర్మించిన అశ్వమేధ యజ్ఞశాల, గౌతమ బుద్ధుని ధాతువులు లభ్యమైన మహాస్తూపం, శ్రీలంక దేశానికి సంబంధించిన సింహల విహారంను సందర్శించారు. నాగార్జునకొండ మ్యూజియంలో బుద్ధ ధాతువులకు స్థానిక టూరిజం గైడ్‌ సత్యనారాయణ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు,నాగార్జున కొండ, బుద్దవనం విశేషాలను వివరించారు. శ్రీలంక మంత్రి హెనిడుమ సునీల్‌ సెనేవి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొని ఉన్న యుద్ధ వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, బుద్దవనం నిర్వహించిన సదస్సులో తాను పాల్గొనడం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.

యుద్ధ సమయంలో ఇటువంటి శాంతి సదస్సులు నిర్వహించడం మంచి పరిణామం అన్నారు. భారతదేశానికి శ్రీలంకకు మైత్రి సంబంధాలు ఉన్నాయని, వాటిని భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ప్రముఖ బౌద్ధ గురువు వియత్నాం బౌద్ధ సంఘం ఉపాధ్యక్షులు తోచ్‌ నట్‌, గగనమాలిక్‌ ఆధ్వర్యంలో బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య చొరవతో ఇలాంటి శాంతి సదస్సు ద్వారా భవిష్యత్‌లో ఎంతో మార్పు రాగలదని ఆకాంక్షించారు. వారి వెంట ఆంధ్రప్రదేశ్‌ టూరిజం మాజీ సీఎండి, బుద్ధవనం గైడర్‌ చెన్నూరు ఆంజనేయ రెడ్డి, తెలంగాణ టూరిజం ఏజీఎం జంగయ్య, పెద్ద ఊర తాసిల్దార్‌ శ్రీదేవి, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శాసన, ఎస్టేట్‌ మేనేజర్‌ రవిచంద్ర, బుద్దవనం ఆర్ట్స్‌ మరియు ప్రమోషన్స్‌ మేనేజర్‌ శ్యామసుందర్రావు ఉన్నారు. సాగర్‌ సీిఐ శ్రీను నాయక్‌, హాలియా సీఐ సతీష్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -