– రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఓటుతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం భారత ఎన్నికల సంఘానికి కల్పించిన స్వతంత్రత, నిష్పక్షపాతం, స్వేచ్ఛాయుత, న్యాయసమ్మత ఎన్నికలకు పునాది అని అన్నారు. అంబేడ్కర్, మహాత్మాగాంధీ చెప్పినట్టు సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలవదని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, అర్హులైన ఓటర్లకు హోమ్ ఓటింగ్, ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా ఎన్నికలు మరింత సమగ్రంగా మారాయని ప్రశంసించారు. జూబ్లీహిల్స్ (61) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను డ్రోన్ నిఘా, పోలీసు సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించిన తీరును అభినందించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుధర్శన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.39 కోట్ల మంది ఓటర్లున్నారని తెలిపారు. ఇందుకోసం 35,895 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గత జాతీయ ఓటర్ల దినోత్సవం నుంచి ఇప్పటివరకు సుమారు 3.93 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని, అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్టష కర్ణన్, డిప్యూటీ సీఈవో హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఓటుతోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



