మండల విద్యాశాఖ అధికారి నర్సయ్య
మండల స్థాయి బోధనోపకరణాల తయారీ పోటీలు
నవతెలంగాణ – పాలకుర్తి
బోధనోపకరణాల తయారీలో ఉపాధ్యాయులు నైపుణ్యాన్ని చాటి విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించి చైతన్యం చేయాలని మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య సూచించారు. శనివారం మండల కేంద్రంలో గల ప్రాథమిక పాఠశాలలో బోధనోపకరణాల తయారీ (టి ఎల్ ఎం మేళ) ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ బోధనోపకరణాల తయారీలో ఉపాధ్యాయులు తమ నైపుణ్యాన్ని చాటుకుని ప్రతిభను వెలికి తీశారని తెలిపారు.
మండలంలోని నాలుగు కాంప్లెక్స్ లలో బోధనోపకరణాల తయారీ పోటీలు నిర్వహించి టి ఎల్ ఎం మేళాకు కాంప్లెక్స్ కు ఎనిమిది మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారని తెలిపారు. బోధనోపకరణాల తయారీ పోటీలకు 32 మంది పాల్గొన్నారు అని, బోధనోపకరణాల తయారీలో నైపుణ్యాన్ని చాటిన పదిమందిని జిల్లా పోటీలకు ఎంపిక చేశామని తెలిపారు. బోధనోపకరణాల తయారీ ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. తరగతి గదుల్లో ఎంతో ఉపయోగకరమైన బోధనాభ్యాస సామాగ్రి నుంచి తీసుకువచ్చి ప్రదర్శించడం అభినందనీయమన్నారు. బోధనోపకరణాల తయారీ పోటీల్లో తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానంలో నుండి రెండు చొప్పున జిల్లా స్థయి బోధనోపకరణాల తయారీ పోటీలకు ఎంపికయ్యాయని తెలిపారు.
జిల్లాస్థాయికి ఎంపికైన వారిలో దర్దేపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దేవగిరి సూర్యప్రకాష్ తెలుగు, సుఖేందర్ నర్సింగాపురం తండా ప్రాథమిక పాఠశాల, ఇంగ్లీషులో అప్రోజ్ టబాసం, టెంపుల్ కాలనీ ప్రాథమిక పాఠశాలకు చెందిన అఫ్రఫ్ సుల్తానా, గణితంలో కే రామానుజం, ఏ రాజ్ కుమార్, హేమలత, ఆర్ శ్రీ గౌరీ, ఇంగ్లీషులో అనుల కుమారి, తెలుగులో లలిత ఎంపికయ్యారని తెలిపారు. ఈనెల పదిన జిల్లాస్థాయిలో టిఎల్ఎం మేలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాయం శోభారాణి, పుస్కూరి రమేష్, అంజయ్య, గిరిధర్, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.