-మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
– ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు పంపిణీ
నవతెలంగాణ-సిద్దిపేట, గజ్వేల్
రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8 లక్షల కోట్ల అప్పు ఉన్నా.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేస్తున్నామని కార్మిక, ఉపాధికల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేట పట్టణంలో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు 2840 మందికి, అలాగే గజ్వేల్లో పలువురు లబ్దిదారులకు మంజూరీ పత్రాలను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాకు 12 వేల ఇండ్లు మంజూరు చేశామని, సిద్దిపేట నియోజకవర్గానికి 3000 ఇండ్లు, గజ్వేల్ నియోజకవర్గంలో మొదటి దశలో 3500 మంజూరు చేశామన్నారు. ప్రతి ఏడాదీ 3500 ఇండ్ల చొప్పున అందరికీ ఇస్తామన్నారు. అవసరమైతే జిల్లాకు ఎక్కువ వచ్చేలా సీఎంతో మాటాడతానని తెలిపారు. రూ.200 కోట్లతో జిల్లాకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించేందుకు సీఎం ఒప్పుకున్నారన్నారు. రూ.లక్షా 70 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని, వాటితో యువతకు ఉపాధి లభిస్తుందని, జిల్లాలో అడ్వాన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక అందిస్తామన్నారు. సిద్దిపేటలో కలెక్టర్ కె.హైమవతి మాట్లాడుతూ.. ఇల్లు అనేది గౌరవానికి చూచికని, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీకి వచ్చిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుంచి ముగ్గు పోయించుకొని, 6 నెలల్లో పూర్తి చేసుకోని గృహప్రవేశం చేసుకోవాలని, ఇండ్ల నిర్మాణానికి అయ్యే బిల్లులు సమయానికి వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో సిద్దిపేటలో అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, వైస్చైర్మెన్ జంగిటి కనకరాజు, సిద్దిపేట ఆర్డీఓ సాధానందం, హౌసింగ్ పీడీ దామోదర్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, గజ్వేల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ నరసయ్య, ఏఎంసీలు చైర్మెన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ, వైస్ చైర్మెన్ సర్దార్ఖాన్, ప్రభాకర్ పాల్గొన్నారు.
లక్షల కోట్ల అప్పు ఉన్నా.. ‘సంక్షేమం’ అమలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES