ఒడిశా చర్చిలో బంధించి, ప్రార్థనలు ఆపమని బలవంతం
ఇటీవల పాస్టర్పై దాడి..బీజేపీ పాలిత రాష్ట్రంలో ఆగని దాష్టీకాలు
నవరంగ్పూర్ : బీజేపీ పాలిత రాష్ట్రమైన ఒడిశాలోని నవరంగ్పూర్ జిల్లాలోని కపేనా గ్రామం లో చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తున్న దళిత గిరిజనుల పై హిందూత్వమూకలు దౌర్జన్యకాండకు దిగాయి. వారిని వేధించటమే కాదు దాడికి దిగారు. ప్రార్థనలు చేయకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. దీంతో రెచ్చినపోయిన ఆ మూకలు చర్చిలోనే బంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగిందంటే..
జనవరి 25న.. హిందూత్వ మూకల బృందం ప్రార్థనా కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడి గిరిజన క్రైస్తవ కుటుంబాలను తమ విశ్వాసాన్ని వదిలివేయాలని హెచ్చరించింది. వారు తమ మత ఆచారాలను కొనసాగిస్తే చర్చిని కూల్చివేస్తామని, కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరిస్తామని దుండగులు లౌడ్స్పీకర్ల ద్వారా బెదిరింపులు జారీ చేశారు. ” ప్రార్థనలు ఎందుకు ఆపాలని దళిత గిరిజన ప్రశ్నించినప్పుడు.. నిందితులు చర్చికి బయట నుంచి తాళం వేశారు. అందరూ చర్చి నుంచి బయటకు వెళ్లమని బలవంతం చేశారు,” అని స్థానిక నివాసి ట్యూనా శాంటా ఆరోపించారు. తమ మాట వినని ఆ సమాజానికి చెందిన జలధర్ శాంటా (17) , మోహన్ శాంటా (20)పై మూకుమ్మడిగా దాడి చేశారు. స్థానిక ఉమర్కోట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఆ సమాజ సభ్యులు తెలిపారు. గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, శాంతిభద్రతలను కాపాడటానికి భద్రతా సిబ్బందిని మోహరించినట్టు పోలీసులు తెలిపారు. ”ఈ విషయంపై మాకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
కానీ సంఘటన గురించి తెలుసుకున్నాక.. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులను మోహరించాం” అని ఉమర్కోట్ పోలీస్ స్టేషన్ ఐఐసీ రమాకాంత్ సాయి అన్నారు. నవరంగ్పూర్ కలెక్టర్ మహేశ్వర్ స్వైన్ మాట్లాడుతూ.. రెండు వర్గాల సభ్యులతో కూడిన శాంతి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సాధారణ పరిస్థితిని పునరుద్ధరించడానికి సబ్-కలెక్టర్ (నవరంగ్పూర్) ప్రకాశ్ కుమార్ మిశ్రా పర్యవేక్షణలో గ్రామంలో ఒక సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇటీవల ధెంకనల్ జిల్లాలోని ఒక గ్రామంలో ప్రార్థనలు నిర్వహించినందుకు ఒక పాస్టర్పై బహిరంగంగా దాడి చేసి, వేధించిన ఘటన జరిగింది. రాష్ట్రీయ క్రిస్టియన్ మోర్చా, ఒడిశా విభాగం ప్రధాన కార్యదర్శి పల్లవ్ లిమా మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడమే కాదు. ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నంగా కనిపిస్తున్నాయని అన్నారు. నబరంగ్పూర్ విషయంలో… గిరిజనులనే గిరిజనులకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారు అని ఆయన అన్నారు.



