Saturday, April 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంత్వరలోనే డీజీపీ నియామకం

త్వరలోనే డీజీపీ నియామకం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా డీజీపీ పదవికి అర్హులైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లను యుపీపీఎస్సీకి పంపామనీ, అక్కడి నుంచి పేర్ల లిస్ట్‌ రాష్ట్రానికి అందిందని అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు చెప్పారు. రెండు వారాల్లోగా రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నియామకం చేయనుందని తెలిపారు. యుపీపీఎస్సీ ప్యానెల్‌ సిద్ధం చేసి మార్చి 12న పంపిందని వివరించారు. డీజీపీగా శివధర్‌ రెడ్డి నియామకం సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జరిగిందంటూ హైదరాబాద్‌కు చెందిన ధనగోపాలరావు వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి విచారించారు. ప్రకాష్‌సింగ్‌ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయలేదని పిటిషనర్‌ వాదించారు. ఏజీ గడువు కోరడంతో విచారణను ఈనెల 13కు వాయిదా పడింది.

ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే 420 అవ్వదు
వివాహం చేసుకుంటానని ప్రేమించిన అయిదేళ్ల తర్వాత పెళ్లి చేసుకోబోనని చెప్పిన ప్రేమికుడిపై మోసం (ఐపీసీ 420) కింద కేసు పెట్టడాన్ని హైకోర్టు రద్దు చేసింది. ప్రేమ విఫలమైతే మోసం కింద నేరంకాదని చెప్పింది. ప్రేమించిన తొలినాళ్ల నుంచి మోసం చేయాలనే ఉద్దేశంతో ఉండి పెళ్లి చేసుకోనప్పుడు మాత్రమే మోసం కింద నేరం అవుతుందని తీర్పు చెప్పింది. ఇందుకు ఆధారాలు కూడా ఉండాలంది. ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడంటూ ఒక యువతి ఫిర్యాదు ఆధారంగా రామగుండం జిల్లా పొట్యాలకు చెందిన కె.సంతోష్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. దీనిని కింది కోర్టు విచారణ చేస్తోంది. ఈ కేసును సంతోష్‌ సవాలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తుకారాంజీ విచారించి పైవిధంగా తీర్పు చెప్పారు. 2018లో సంతోష్‌ ప్రేమకు ప్రతిపాదిస్తే యువతి నిరాకరించింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి సంతోష్‌ ఒప్పించాడు. ఐదేండ్ల తర్వాత పెళ్లి చేసుకునేందుకు ముఖం చాటేశాడు. ఇది మోసం కిందకే వస్తుందని యువతి లాయర్‌ వాదన. ప్రేమ విఫలం అయితే మోసం కిందకు రాదు. తనపై క్రిమినల్‌ కేసు నమోదు చెల్లదు.. అని సంతోష్‌ లాయర్‌ వాదించారు. కింది కోర్టులో సంతోష్‌పై ఉన్న కేసును హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.

ఐఐఎం ఛైర్మెన్‌, డైరెక్టర్లకు నోటీసులు
ఎంబీఏ అడ్మిషన్లకు అనుమతించాలని ఒక అభ్యర్థి విషయంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయని ముంబై ఐఐఎం చైర్మెన్‌ శశికిరణ్‌ శెట్టి, డైరెక్టర్‌ మనోజ్‌ కె.తివారీలకు హైకోర్టు కోర్టుధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్లను వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలిచారంటూ గుండ్లపోచంపల్లికి చెందిన కటారు సత్యసాయి పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని సింగిల్‌ జడ్జి గతంలో విచారించి పిటిషనర్‌ను వ్యక్తిగత ఇంటర్వ్యూలకు అనుమతించాలని గత ఆదేశాలను అమలు చేయలేదని సత్య సాయి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. దీంతో న్యాయమూర్తి, ఐఐఎం చైర్మెన్‌, డైరెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30లోగా కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. లేకపోతే వారిద్దరూ వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలన్నారు. ఇదీ చేయకపోతే రూ.10 వేలు చెల్లించాలన్నారు. విచారణ 30కి వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -