ప్రపంచంలోనే రెండో స్థానం :నేచర్ జర్నల్ నివేదిక
వియన్నా: చక్కెర (డయాబెటిస్) వ్యాధి జన జీవితాలతో పాటు దేశాల ఆర్థిక వ్యవస్థలకూ పెనుభారంగా పరిణమిస్తోంది. ఈవిధమైన ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందంటూ వెలువడిన తాజా అధ్యయన నివేదిక ఆందోళన రేకెత్తిస్తోంది. ఆస్ట్రియాలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్, వియన్నా యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్లకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. డయాబెటిస్ వల్ల 2020 నుంచి 2050 సంవత్సరం మధ్యకాలంలో 204 ప్రపంచ దేశాలపై ఎంతమేర ఆర్థికభారం పడుతుందనే అంచనా వేసేందుకు వారు ప్రయత్నించారు. నేచర్ జర్నల్లో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది.
అధ్యయన నివేదికలోని ప్రధానాంశాలివి…
దేశంలోని డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై దాదాపు రూ.1,029 లక్షల కోట్లు (11.4 ట్రిలియన్ డాలర్లు- 12వ తేదీన డాలర్ మారకం విలువతో పోలిస్తే) భారం పడనుంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో అమెరికా నిలిచింది. పెద్ద సంఖ్యలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులుండడంతో ఈ దేశంపై 16.5 ట్రిలియన్ డాలర్ల భారం పడనుంది. ఇక మూడో స్థానంలో మన పొరుగుదేశం చైనా ఉంది. అక్కడ కూడా పెద్దసంఖ్యలో చక్కెర వ్యాధిగ్రస్తులుండడంతో చైనాపై 11 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడనుంది.ఏటా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చికిత్స కోసం అధికారికంగా దాదాపు 10 ట్రిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నారని అంచనా. ఇది ప్రపంచ వార్షిక స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో దాదాపు 0.2 శాతానికి సమానం. అనధికారికంగా డయా బెటిస్ వ్యాధిగ్రస్తుల కోసం కుటుంబీకులు ఏటా చేస్తున్న ఖర్చులు ఇంకా ఎక్కువే ఉంటున్నాయి. వాటి విలువ ఏకంగా 152 ట్రిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా. ఇది ప్రపంచ వార్షిక జీడీపీలో 1.7 శాతానికి సమానం.
భారీగా వైద్య ఖర్చులు .. అరకొర ఉపాధి అవకాశాలు
”భారత్, చైనాలలో పెద్ద సంఖ్యలో డయాబెటిస్ రోగులు ఉన్నారు. ఈ రెండు దేశాలతో పోలిస్తే అమెరికాలో తక్కువ సంఖ్యలోనే చక్కెర వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కానీ అగ్ర రాజ్యంలో డయాబెటిస్ వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ భారాన్ని.. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల వైద్య బిల్లులను అమెరికా సర్కారే చెల్లిస్తుంది. ఈవిధంగా వైద్య ఖర్చులకు భారీ కేటాయింపులు చేస్తుండటంతో అమెరికా లాంటి సంపన్న దేశాలపై డయాబెటిస్ రోగుల వల్ల సగటున 41 శాతం మేర ఆర్థిక భారం పడుతోంది. ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు లేకపోవడం వల్ల భారత్ లాంటి అల్ప ఆదాయ దేశాలపై సగటున 14 శాతం మేర ఆర్థిక భారం పడుతోంది. మొత్తం మీద డయాబెటిస్కు సమగ్ర చికిత్సను సంపన్న దేశాల ప్రజలే పొందగలు గుతున్నారు” అని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు విశ్లేషించారు.
బాధిత కుటుంబాలపై పెనుభారం
”ఇంట్లోని డయాబెటిస్ రోగికి వైద్యచికిత్సలు చేయించే కుటుంబీకుడికి ఏదైనా జరిగితే పరిస్థితి పూర్తిగా గాడి తప్పుతుంది. ఆ వ్యక్తి కొంతకాలం పాటు ఉద్యోగాన్ని కోల్పోయినా యావత్ కుటుంబంపై ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లోని డయాబెటిస్ రోగికి సకాలంలో తగిన చికిత్స చేయించడం కష్టతరంగా మారు తుంది” అని ఈ అధ్యయనంలో పాల్గొన్న వియన్నా యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ప్రొఫెసర్ క్లౌజ్ ప్రెట్నెర్ తెలిపారు.
వీటితో ఆర్థిక భారానికి అడ్డుకట్ట
”ప్రజల్లో డయాబెటిస్ను తొలి దశలోనే గుర్తించేలా ప్రపంచ దేశాలు షుగర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలి. డయా బెటిస్ తొలి దశలో ఉన్నవారికి సకాలంలో తగిన చికిత్సను అందించాలి. జీవనశైలిలో ఆరోగ్యకర మార్పులు చేసుకునేలా విలువైన సలహాలు, సూచన లను అందించాలి. సమతుల్య ఆహారం తీసుకునేలా, కనీస శారీరక వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి. ప్రభుత్వ వైద్య వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే దేశ ఆర్థికవ్యవస్థపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోని మదుమేహ రోగుల్లో పావు వంతు(25 శాతం) మంది ఒక్క భారత్లోనే ఉన్నారు” అని అధ్యయన నివేదికలో పరిశోధకులు ప్రస్తావించారు.



