– విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న ముడి చమురు ధరలు
– పడిపోతున్న రూపాయి విలువ
– మధ్యప్రాచ్యంలో వివాదం ముదిరితే అల్లకల్లోలమేనంటున్న నిపుణులు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత విదేశీ మారక నిల్వలు తీవ్ర ఒత్తిడికి ఎదుర్కొంటున్నాయి. ఓ వైపు బ్రెంట్ ముడి చమురు (ఉత్తర సముద్రం నుండి తీసిన ఓ రకమైన ముడి చమురు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు ఇది ఓ బెంచ్మార్క్గా ఉపయోగపడుతోంది) ధరలు పెరిగిపోతుంటే మరోవైపు రూపాయి విలువ తగ్గుతోంది. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మన బ్రెంట్ ముడి చమురు దిగుమతులు గత కొన్ని వారాలుగా బాగా పెరుగుతున్నాయి. ప్రపంచ ముడి చమురులో సుమారు 20 శాతం హర్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా హర్ముజ్ ద్వారా జరుగుతున్న చమురు రవాణాకు ఆటంకం కలుగుతోంది. దీంతో ప్రపంచ చమురు మార్కెట్లలో ధరలు పెరిగిపోతున్నాయని అంటున్నారు.
న్యూఢిల్లీ : అప్పుడప్పుడు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు చమురు ధరలను కొంతమేర తగ్గిస్తున్నప్పటికీ బ్రెంట్ ముడి చమురు ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మన ముడి చమురు అవసరాలు 85 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఏర్పడే అస్థిర పరిస్థితుల ప్రభావం భారత్పై అనివార్యంగానే పడుతోంది. రూపాయి విలువ తగ్గిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నెల 2-19 తేదీల మధ్య డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ.85.35 నుండి రూ.86.86కు…అంటే 1.75 శాతం పడిపోయింది. ఈ తగ్గుదల తక్కువగానే కన్పిస్తున్నప్పటికీ డాలర్-చమురు ధరను బట్టి చూస్తే ప్రభావం ఎక్కువగానే ఉంది. ముడి చమురు ధరలు, రూపాయి విలువ అననుకూల దిశగా కదులుతున్నప్పుడు దిగుమతి బిల్లుపై అధిక ప్రభావం పడుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ ఒక్క రూపాయి పడిపోయినా..చమురు దిగుమతుల భారం రూ.8వేల నుంచి రూ.10 వేల మేర పెరగనుంది.
రంగంలోకి ఆర్బీఐ
అనిశ్చిత పరిస్థితులు ప్రపంచ ముడి చమురు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో బ్యారల్ ముడి చమురు ధర 65 డాలర్లు ఉండగా గత వారం 73-76 డాలర్లకు పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యారల్ సగటు ముడి చమురు ధర 78 డాలర్లుగా ఉంది. దాని కంటే ప్రస్తుత ధర తక్కువే అయినప్పటికీ ఇంధన సరఫరాలో నెలకొన్న అంతరాయాల కారణంగా రాబోయే కాలంలో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా కాలం పాటు ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉంటాయని, అవి భారతీయ కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతాయని క్రిసిల్ తెలిపింది. అంతేకాక రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు కూడా పెరగవచ్చునని హెచ్చరించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న రిజర్వ్బ్యాంక్ ఆచితూచి వ్యవహరిస్తోంది. రూపాయి విలువలో అస్థిరతను నివారించడానికి డాలర్ల పరిమిత అమ్మకాల ద్వారా కరెన్సీ మార్కెట్లలో జోక్యం చేసుకుంటోంది. మరోవైపు క్షీణిస్తున్న నిల్వల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాల్సి ఉంది. బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు పొందే మొత్తం (రిటర్న్)లో పెరుగుదల కన్పిస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలకు ఇది అద్దం పడుతోంది. ప్రభుత్వ రుణాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఏం జరుగుతుంది?
పెరిగిన ముడి చమురు ధరలు, పడిపోతున్న రూపాయి విలువ…ఈ రెండు సవాళ్లు మన కరెంట్ ఖాతా లోటు పెంచుతాయి. ఖర్చులు పెరిగి ఆర్థిక సమతుల్యత దెబ్బతింటుంది. ఈ ఒత్తిడులు దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్య, ఆర్థిక విధాన ఎంపికలు మరింత సంక్లిష్టమవుతాయి. పశ్చిమాసియాలో నెలకొన్న వివాదంతో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. దౌత్య యత్నాలు కొనసాగితే ఇంధన మార్కెట్లలో ఉద్రిక్తత తగ్గుతుంది. రూపాయిని స్థిరీకరించే అవకాశం ఏర్పడుతుంది. అదే వివాదం పెరిగిన పక్షంలో ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మన దేశం చాలా అల్లకల్లోలమైన విదేశీ మారక ద్రవ్య పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రానున్నది కష్టకాలమే
- Advertisement -
- Advertisement -