ఎన్నికల నోటిఫికేషన్ జారీ
ఆశావహుల హడావుడి
సోషల్ మీడియాలో ప్రచారం
నవతెలంగాణ – నసురుల్లాబాద్
పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. బరిలో నిలిచే ఆశావహులకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆశించిన రిజర్వేషన్ దక్కకపోవడంతో కొందరి అంచనాలు తారుమారయ్యాయి. మరోవైపు తమ అనుచరగణంతో నాయకులు మంతనాలు సాగిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించగా నసురుల్లాబాద్, ఉమ్మడి మండలం బీర్కూర్ మండలాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు.
మేజర్ పంచాయతీల్లో సర్పంచి పదవి కోసం గట్టీ పోటీ పెరుగుతోంది. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం ఆదివారం నుంచే ఆశావహులు గ్రామాల్లో మీటింగులు, సమావేశం, వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేయడం, సోషల్ మీడియాలో ప్రచారం సాగనిస్తున్నారు.
ఏర్పాట్లలో అధికార గణం
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. రెండ్రోజులుగా రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా చేసిన అధికార బృందం ఇతర ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. నసురుల్లాబాద్ మండలంలో 19 గ్రామ పంచాయతీలు, 164 వార్డులు,8 ఎంపీటీసీలు ఉండగా, బీర్కూర్ మండలంలో 13 గ్రామ పంచాయతీలు 114 వార్డులు ఉండగా 8 ఎంపీటీసీలు స్థానాలు ఉన్నాయి. అధికారులు ఉమ్మడి మండలాల్లో తొలి విడతలో పీవోలకు రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. పల్లెల్లో ఎక్కడ చూసిన రిజర్వేషన్లపై చర్చించుకుంటున్నారు.
ఆశావహుల హడావుడి
పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి దాదాపు ఏడాదిన్నర, జడ్పీ, మండల పరిషత్ పాలకవర్గాలు గడువు ముగిసి ఏడాది దాటింది. పల్లెల్లో రానున్న ఎన్నికలపై రాజకీయ పార్టీతో పాటు ఆశావహులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు వారి నిరీక్షణకు తెరదించేలా ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటి వరకు పట్టించుకోని పలువురు ఓటర్లను సైతం ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. యువతకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామానికి అవసరమైన పనులన్నీ చేసి పెడుతామనే నమ్మకం కల్పించేలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయ హడావుడి మొదలైంది.