నవతెలంగాణ – ఉప్పునుంతల
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పి.యం.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 69వ జిల్లా స్థాయి చదరంగ (చెస్) పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
చదరంగం ఆట విద్యార్థుల్లో ఏకాగ్రతను, ఆలోచనాశక్తిని, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఆటల ద్వారా విద్యార్థులలో పట్టుదల, మానసిక వికాసం, శారీరక దృఢత్వం పెంపొందుతుందని తెలిపారు.
ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి 210 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలురు, బాలికలకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చంద్రశేఖర్, డివైఎస్ఓ సీతారాం, ఎస్జిఎఫ్ సెక్రటరీ పాండు, పీఈటీల సంఘం అధ్యక్షులు యాదయ్య గౌడ్, నిరంజన్ యాదవ్, వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మణ్, నాగేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.