Saturday, July 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅభివృద్ధిలో భాగస్వాములుకండి

అభివృద్ధిలో భాగస్వాములుకండి

- Advertisement -

– పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం : యూఏఈ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌ బాబు పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్య సాధనలో పాలు పంచుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు యూఏఈ పారిశ్రామికవేత్తకు పిలుపు నిచ్చారు. గురువారం హైదరాబాద్‌ లోని హెచ్‌ఐసీసీలో యూఏఈ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ”ఇన్వెస్టోపియా గ్లోబల్‌” పేరిట నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును ఆయన ప్రారంభించారు. పారిశ్రామికాభివృద్ధికి అపార అవకాశాలు న్నందున తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. ”2024-25లో జీఎస్‌డీపీలో 8.2 శాతం వృద్ధి నమోదైంది. ఇది జాతీయ సగటు(7.6 శాతం) కంటే ఎక్కువ. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతానికి పైగా ఉంది” అని ఈ సందర్భంగా మంత్రి వారికి వివరించారు. డ్రై పోర్టులు, మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులు, పారిశ్రామిక కారిడార్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. నెట్‌-జీరో పారిశ్రామిక పార్కులు, ఈవీ జోన్లు, గ్రీన్‌ లాజిస్టిక్స్‌ హబ్‌లు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌), మెట్రో ఫేజ్‌ 2 తదితర ప్రాజెక్టులు పారిశ్రామికాభివృద్ధికి మరింత దోహదపడనున్నాయని పేర్కొన్నారు. ”గడిచిన ఆర్థిక సంవత్సరంలో యూఏఈకి తెలంగాణ ఎగుమతులు 2.5 రెట్లు పెరిగాయి. ఫార్మా, ఏరోస్పేస్‌, డిజిటల్‌ సేవలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కీలక పాత్ర పోషించాయి. ఇప్పటికే యూఏఈకి చెందిన లులు గ్రూప్‌, డీపీ వరల్డ్‌, నాఫ్కో వంటి కంపెనీలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యాయి. ఏఐ, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, లైఫ్‌ సైన్సెస్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, పునరుత్పాదక ఇంధనం, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌, ట్రేడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆగ్రో ఎగుమతులు, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ తయారీ, ఎలక్ట్రిక్‌ వాహనాలు, స్మార్ట్‌ మొబిలిటీ, పర్యాటకం, వెల్‌నెస్‌, మెడికల్‌ తదితర రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూఏఈ మినిస్టర్‌ ఆఫ్‌ ఎకానమీ, టూరిజం అబ్దుల్లా బిన్‌ తాక్‌ అల్‌ మర్రి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజరు కుమార్‌, టీజీఐఐసీ ఎండీ కె.శశాంక, అండర్‌ సెక్రెటరీ ఆఫ్‌ ది యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మహ్మద్‌ అల్వాహీ, యూఏఐ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్టర్స్‌ కౌన్సిల్‌ సెక్రెటరీ జనరల్‌ వాలిద్‌ హరేబ్‌ అల్‌ ఫలాహి, ఇన్వెస్టోపియా సీఈవో డా.జీన్‌ ఫారెస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -