Friday, June 27, 2025
E-PAPER
Homeజాతీయంజాతీయ ప్రయోజనాలను దెబ్బతీసే వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయొద్దు

జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసే వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయొద్దు

- Advertisement -

– ప్రధాని మోడీకి ఎస్కేఎం విజ్ఞప్తి
– రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు, కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి
– రైతు, కార్మిక వ్యతిరేక వాణిజ్య ఒప్పందాలపై పార్లమెంట్‌లో చర్చించాలి
– జులై 9న సామూహిక నిరసన ప్రదర్శనలకు పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

వ్యవసాయం, పరిశ్రమలను దెబ్బతీసే, జాతీయ ప్రయోజనాలను వదులుకునే ఎలాంటి వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయొద్దని ప్రధాని మోడీని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం, పరిశ్రమలు రాష్ట్ర జాబితాలో ఉన్నందున, ప్రధాని ముందుగా వాణిజ్య ఒప్పందాలపై ముసాయిదా ప్రతిపాదనలను పార్లమెంటులో ఉంచాలని, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు, కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేసింది. పరస్పర సుంకాలను విధించాలనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అల్టిమేటం జులై9 నుంచి అమల్లోకి వస్తుందని, ఇండియా-యూకే ఎఫ్‌టీఏ ప్రకటన అలాగే యూఎస్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, పైప్‌లైన్‌లో ఉన్న అనేక వాణిజ్య ఒప్పందాలన్నీ రహస్యంగా ఉన్నాయని తెలిపింది. రైతులు, కార్మికుల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పార్లమెంట్‌తో కూడా ఎటువంటి సంప్రదింపులు జరపలేదని పేర్కొంది. దేశంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేపలు పెంపకం, ఉద్యానవన పంటలు మొదలైన వాటిపై ఆధారపడిన లక్షలాది మందికి ఈ ఒప్పందాలు చరమగీతం కావచ్చని హెచ్చరించింది. వ్యవసాయంతో పాటు, జనరిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ నుంచి ఆటో విడిభాగాలు వంటి రంగాలలోని ఎంఎస్‌ఎంఈలు, ఈ రంగాలలోని లక్షలాది మంది కార్మికుల ప్రయోజనాలు కూడా ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది.చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలు ట్రంప్‌ సుంకాలను తీవ్రంగా వ్యతిరేకించి, తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి చర్యలు చేపట్టాయని, ఇండియా తన జాతీయ ప్రయోజనాలను లొంగిపోవడానికి, వదులుకోవడానికి సిద్ధపడిందని ఎస్కేఎం విమర్శించింది. ముఖ్యంగా, అమెరికాకు 70 శాతానికి పైగా ఎగుమతులు కలిగిన కెనడా, మెక్సికోలు ఎదురుదాడి చేశాయని, అయితే అమెరికాకు కేవలం 18 శాతం ఎగుమతులు కలిగిన ఇండియా మాత్రం అమెరికా వ్యూహాలకు వ్యతిరేకంగా నిలబడటానికి నిరాకరించడం దారుణమని పేర్కొంది. అమెరికాకు ఇండియా వాణిజ్య ఒప్పందాన్ని అందించిందని, దీనితో విస్తృత శ్రేణి అమెరికన్‌ వస్తువులపై ”ప్రాథమికంగా సున్నా సుంకాలు” ఉండే అవకాశం ఉందని ట్రంప్‌ పేర్కొన్నారని గుర్తు చేసింది. దిగుమతులపై జీరో-డ్యూటీ ఫ్రేమ్‌వర్క్‌ కలిగి ఉండాలనే తన సంసిద్ధతను ఇండియా ఇప్పటికే అంగీకరించినట్టు ఇది స్పష్టం చేస్తోందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడి ఆదేశాలకు లొంగిపోయి, అమెరికా ఉత్పత్తులకు సుంకం, నాన్‌-టారిఫ్‌ అడ్డంకులను తగ్గించే ప్రణాళికలతో మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల, రాష్ట్రాల సమాఖ్య హక్కులను గాలికి వదిలేస్తూ సంతకాల పర్వం కొనసాగిస్తోందని ధ్వజమెత్తింది.
”చర్చలో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పాడి రైతులకు మరణశిక్షగా ఉంటుంది. ఎందుకంటే సుంకాలు, మార్కెట్‌ పరిమితులు ఎత్తివేస్తే ఇండియాకి అమెరికా డెయిరీ ఎగుమతులు భారీగా పెరుగుతాయి. మొక్కజొన్న విషయంలో, జన్యుపరంగా మార్పు చెందిన మొక్కజొన్న, ఇథనాల్‌పై ఇండియా దిగుమతి నిషేధాన్ని తొలగించాలనే ఒత్తిడి ఉంది. దీనివల్ల అమెరికాకు 300 మిలియన్‌ డాలర్ల వరకు ఊహించని లాభాలు లభిస్తాయని అంచనా. అదేవిధంగా, సోయాబీన్‌, బాదం, పిస్తా, వాల్‌నట్‌, ఆపిల్‌, ఇతర ఉద్యాన పంటలు అన్నీ చర్చలకు సిద్ధంగా ఉన్నాయి” అని ఎస్కేఎం పేర్కొంది.
”2001 నుంచి ఆపిల్‌ దిగుమతులు 0.2 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 6 లక్షల మెట్రిక్‌ టన్నులకు, దేశీయ ఉత్పత్తిలో 1.7 శాతం నుంచి 22.5 శాతానికి పెరిగాయి. అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్చే విదేశీ ఆపిల్స్‌.. మన దేశీయ పండ్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో ఎనిమిది లక్షలకు పైగా ఆపిల్‌ పండించే కుటుంబాల జీవితాలు ప్రమాదంలో పడనున్నాయి” అని పేర్కొంది. ”దేశంలో పత్తి రైతులు ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వార్షిక పత్తి ఉత్పత్తి 2017-18లో 37 మిలియన్‌ బేళ్ల (ఒక్కొక్కటి 170 కిలోలు) నుండి 2022-23లో 34.7 మిలియన్‌ బేళ్లకు స్థిరంగా తగ్గుతోంది. 2023-24లో 31.6 మిలియన్‌ బేళ్లకు మరింత తగ్గుతుందని అంచనా. అందువల్ల సుంకాలను ఉపసంహరించుకునే చర్చలతో అమెరికా నుంచి చౌకైన పత్తి ఇండియా రైతుల మార్కెట్‌ వాటాను ఆక్రమిస్తుంది” అని ఎస్కేఎం వివరించింది.
”ఇండియా నుంచి అమెరికాకు వ్యవసాయ ఎగుమతులు ప్రస్తుతం 5.3 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే అమెరికా నుంచి ఇండియాకి వచ్చే వ్యవసాయ ఎగుమతులు 37.7 శాతం ఎదుర్కొంటున్నాయి. అంటే 32.4 శాతం అంతరం ఉంది. సుంకాలను సున్నాకి లేదా చాలా తక్కువ స్థాయికి తగ్గించడంతో అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు వరద గేట్లు తెరిచినట్టు అవుతుంది. అది ఇండియాలోని చిన్న ఉత్పత్తిదారుల జీవనోపాధిని నాశనం చేస్తుంది” అని ఎస్కేఎం తెలిపింది.
”అమెరికాలో వ్యవసాయం ఎక్కువగా వ్యవసాయ వ్యాపారాల ద్వారానే జరుగుతుందనే వాస్తవాన్ని ద ృష్టిలో ఉంచుకుని దీనిని చూడాలి. వ్యవసాయ రంగంలోని మొత్తం శ్రామిక శక్తిలో కేవలం 2.6 శాతం మంది మాత్రమే ఉన్నారు. అమెరికా రైతు 2016లోనే 61,286 యూఎస్‌ డాలర్ల( అంటే రూ. 52,09,310) దేశీయ మద్దతుగా అందుకున్నారు. దీనికి విరుద్ధంగా, ఇండియాలోని మొత్తం శ్రామిక శక్తిలో 48.6 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. 2018-19లో ఇండియా రైతులు అందుకున్న తలసరి సబ్సిడీ కేవలం 282 యూఎస్‌ డాలర్లు (అంటే రూ. 23,970). ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చాలా అసమానంగా ఉంది. దాని ఫలితంగా ఇండియా రైతులకు ధరల పతనంతో వారి జీవనోపాధిని నాశనం అవుతుంది. తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది” అని స్పష్టం చేసింది.
”దేశంలోని రైతులు రాబోయే రోజుల్లో పెద్ద పోరాటాలకు సిద్ధం కావాలి. జులై 9న కార్మిక వర్గం అఖిల భారత సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంగా, రైతులు, వ్యవసాయ కార్మికులు రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలి. మోడీ సర్కార్‌ చేసుకునే ఒప్పందాల్లో కనీస పారదర్శకత కూడా లేని అసమాన వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. ఇది కార్పొరేట్‌ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కానుంది. విజయం సాధించే వరకు కార్మికులు, రైతులు పోరాడటానికి సిద్ధం కావాలి” అని ఎస్కేఎం పిలుపునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -