సాయిహర్ష ఆస్పత్రిలో ఘటన
ఆస్పత్రిపై ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
డాక్టర్ల నిరక్ష్యానికి తల్లిగర్భంలోనే శిశువు ప్రాణాలు కోల్పోయింది. మృతిచెందిన శిశువుతో ఆ తల్లి తల్లడిళ్లుతోన్నా ఆ ఆస్పత్రి వైద్యులకు కనికరం కలగలేదు. చివరకు ఎలాగోలా వదిలించుకొని మరో ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. చేసేది లేక మరో ఆస్పత్రికి వెళ్లి పరీక్షిస్తే తల్లిగర్భంలోనే శిశువు మృతి చెందినట్టు గుర్తించారు. గర్భంలోనే మృతిచెందిన శిశువును ఆపరేషన్ ద్వారా తీసేసి తల్లిప్రాణాలు కాపాడారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన కడారి శ్రీహరి తన భార్య మహేశ్వరి ఎనిమిది నెలల గర్బిణి.
ఈ ఎనిమిది నెలలుగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని సాయిహర్ష ఆస్పత్రిలో డాక్టర్ మంజుల వద్ద వైద్యం తీసుకుంటోంది. ఆమె నిండు గర్భిణీ కాబట్టి వైద్యం కోసం సోమవారం ఆస్పత్రికి రాగా బీపీ తగ్గిందని వైద్యులు మాత్రలు ఇచ్చి పంపించారు. మంగళవారం రాత్రి మహేశ్వరి తీవ్ర కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ ఆస్పత్రికి వచ్చింది. అయితే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల గర్భంలోనే శిశువు మరణించిన విషయం డాక్టర్ మంజులకు తెలిసినా గర్భిణీకి విషయం చెప్పలేదని బాధితులు ఆరోపించారు. పైగా హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆమె సూచించారని బంధువులు తెలిపారు. చేసేది లేక మహేశ్వరిని ఆమె కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అప్పటికే శిశువు మరణించిందని ఆస్పత్రిలో చెప్పారు. కడుపులోనే మృతిచెందిన బిడ్డను ఆపరేషన్ ద్వారా తీసేసి మహేశ్వరి ప్రాణాలను కాపాడారు. నిత్యం వైద్యపరీక్షలు చేయించుకునే సాయిహర్ష ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు గర్భంలోనే మృతి చెందిందని వారి కుటుంబ సభ్యులు సాయిహర్ష ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. సాయిహర్ష ఆస్పత్రిలో గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, వైద్యరంగంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా వెంటనే ఆస్పత్రిని సీజ్ చేసి తమకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
డాక్టర్ నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



