నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయాల సముదాయంలో ( ఐడిఓసి )లో దొడ్డి కొమరయ్య జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ ) మధు మోహన్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, “దొడ్డి కొమురయ్య తెలంగాణ తొలి అమర వీరుడని, రెండు పదుల వయసు నిండకుండానే భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల కోసం రైతాంగ పోరాటం చేసి అమరుడైన మహా వీరుడని తెలిపారు.
ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని, ఆయన ధైర్యసాహసాలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.” బహుజన సంఘాల నాయకులు, కుర్మ సంఘం నాయకులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సహాయ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, గణేష్ నాయక్, విఠల్, నాగరాజు, కుర్మ సంఘం నాయకులు భూమయ్య, సంజీవ్ స్వామి, అశ్వక్, నరేష్, స్వప్న, సునీత, పవన్ మరియు జిల్లా అధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.



