రాష్ట్రంలో వీధికుక్కల బెడద పెరుగుతున్నది. ఏ మూలనుంచి ఏ కుక్క వచ్చి దాడిచేస్తుందో తెలియని దుస్థితి నెలకొన్నది. చిన్నారులు ఇంటిముందు ఆడుకుంటున్నా తల్లిదండ్రులు వారిని ఒంటరిగా వదల్లేని పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ మహానగరంలోనైతే ఈ సమస్య మరింత జఠిలంగా మారింది. పౌరుల రక్షణకు చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ నాలుగు నెలల్లోనే పదివేల మందికి పైగా కుక్కకాటుకు గురై బాధితులు చికిత్స తీసుకుంటున్నట్టు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) లెక్కల్ని చూస్తే అర్థమవుతున్నది. సాధారణంగా నారాయణగూడలోని ఐపీఎంకు నెలకు రెండు వేల నుంచి రెండువేల ఐదువందల మధ్య ఓపి ఉంటుంది. కానీ ఏప్రిల్, మే నెలల్లో అది కాస్తా మూడు వేలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తున్నది. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్ర తలతో నీరు దొరక్క పోవడం, రహదారులపై వేసే చెత్త, దుర్గంధంతో కుక్కలు అక్కడే గుమిగూడటం, ఆహారం దొరక్క ఆగ్రహంతో అటువైపుగా వెళ్లేవారిపై దాడిచేసి గాయపరచడం తరచూ జరుగుతున్నవి. ఇది జీహెచ్ఎంసీ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తున్నది.
ఇటీవల వెల్లడయిన ఒక సర్వే ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా సంభవించే రేబిస్ మరణాల్లో ముప్పై ఆరుశాతం మనదేశం నుంచే ఉండటం ఆందోళన కలిగించే అంశం. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్నాటక తర్వాత తెలంగాణలోనే ఈ కేసులు నమోదవుతున్నట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం. యాంటి రేబిస్ టీకాలు పీహెచ్సీలతో పాటు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాల్సి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా దీనిపై ఒక స్పష్టత లేదు. రేబిస్ నిరోధక టీకాల కొనుగోలు, సరఫరా అంతా ఒక మిథ్యగానే ఉంది. కోట్లాది రూపాయలు వ్యయం చేసి కొంటున్నామని చెబుతున్నప్పటికీ మందులు మాత్రం అందుబాటులో లేవన్నది సత్యం! ఎందుకంటే, అధికారిక లెక్కల ప్రకారమే కుక్కకాటుతో దాదాపు యేటా యాభైవేల మంది ఆస్పత్రుల పాలవుతున్నారంటే టీకాల కొరత దానికి సాక్ష్యం. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్-2001 ప్రకారం వీధి కుక్కల జనాభాను తగ్గించడానికి వాటికి స్టెరిలైజేషన్ టీకాలు వేయాలి.కానీ వీటి నియంత్రణకు నిధుల కొరత చాలా రాష్ట్రాలను వెంటాడుతున్నది. కేంద్రమైనా పట్టించుకుంటుందంటే అదీ లేదు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3.8లక్షల శునకాలున్నట్టు 2023లో హైకోర్టుకు ఇచ్చిన గణాంకాల్ని బట్టి తెలుస్తున్నది.7.21లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించినట్టు కార్పొరేషన్ తెలిపింది. మేయర్ మాత్రం 5.75లక్షల కుక్కల్ని గుర్తించినట్టు పేర్కొంది. పొంతన లేని సమాధానాలే అనేక ప్రశ్నలకు ఆస్కారమిస్తున్నాయి. వాస్తవానికి దీనికి రెట్టింపు కుక్కలు నగరవాసుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి! సుమారు వందమంది నిత్యం ఏదో ఓచోట ఈ కుక్కల బారిన పడి గాయాలపాలు కావాల్సి వస్తున్నది. రెండేండ్ల కిందట అంబర్పేటలో జరిగిన కుక్కల దాడిలో నాలుగేండ్ల చిన్నారి మృతి ఘటనను సుమోటాగా తీసుకున్న హైకోర్టు కుక్కల జనాభా నియంత్రణ, పౌరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. అప్పటికి దీనిపై ఒక ప్రణాళిక గానీ, ముందస్తు కసరత్తు లాంటివి అధికార యంత్రాంగం చేయలేదు. దీంతో నెలల వ్యవధిలోనే మరో ఎనిమిది ఘటనలు చోటుచేసుకున్నాయి. మళ్లీ హైకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప సర్కార్లో కదలిక రాలేదు.
‘రాష్ట్రంలో వీధికుక్కల బెడదను నిర్మూలిస్తామని, చిన్నారుల మరణాలు మరెక్కడా సంభవించకుండా చర్యలు తీసుకుంటామని’ ముఖ్యమంత్రి చెప్పారు. కానీ, ఈ రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా పదిహేను నుంచి ఇరవైమంది చిన్నారులు కుక్కలదాడిలో బలయ్యారు? వరుస ఘటనల నేపథ్యంలో ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆక్రోశంతో బ్లూక్రాస్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్న జీహెచ్ఎంసీ కొన్నిరోజులు హడావిడి చేసింది. కానీ అది మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. భారత జంతు సంక్షేమ బోర్డు నియమాల ప్రకారం జంతువులకు స్టెరిలైజేషన్ చేసి, యాంటీ-రేబిస్ టీకాలు వేసి, కోలుకున్న తర్వాత, వాటిని పట్టుకున్న అదే ప్రాంతంలో వదిలేయాలి. కానీ ఆదిశగా అడుగులు వేయడంలో సర్కారు నిర్లక్ష్యం కనిపిస్తున్నది. గ్రామాల్లోనూ కుక్కల స్వైర విహారానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. గొర్రెల మందలపై విచ్చలవిడిగా దాడులు చేయడంతో పలుచోట్ల మృత్యువాత పడుతూ కాపరులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నవి. ఇప్పటికైనా ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వీధికుక్కల బెడదను తగ్గించేందుకు కారణాల్ని విశ్లేషించాలి. చిన్నారుల మరణాలను అరికట్టాలి. లేదంటే ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’ అన్న నానుడి సర్కార్కు కూడా వర్తిస్తుంది.
కుక్కకాటుకు ‘చావు’ దెబ్బ!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES