Friday, May 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనోరు జారొద్దు

నోరు జారొద్దు

- Advertisement -

– కవిత లేఖ, ఈటలకు నోటీసులపై ఎవ్వరూ మాట్లాడొద్దు
– వ్యక్తిగత స్టేట్‌మెంట్లతో పార్టీకి నష్టం
– ఎంపీలు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్‌లో కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కవిత లేఖ వేడి బీజేపీ పార్టీ నేతలకూ తగిలింది. ఇటు కాళేశ్వరం కమిషన్‌ విచారణ, అటు కవిత లేఖాస్త్రం రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. కాళేశ్వరం అంశంలో బీజేపీ ఎంపీ ఈటలకు కమిషన్‌ నోటీసులు జారీ చేయడం, మరోవైపు కాళేశ్వరంలో అవినీతి జరిగిందనీ, కేసీఆర్‌ తన పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌రావు మాట్లాడటం చర్చనీయాంశమవుతున్నది. ఇలా మాట్లాడటం వల్ల ఈటలపైనే సొంత పార్టీ నేతలు దాడి చేసినట్టు అవుతుందని జాతీయ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎంపీ డీకే అరుణ ప్రెస్‌మీట్‌లలో కామెంట్లు చేయడం కూడా చర్చనీయాంశమైంది. డీకే అరుణ కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలకే పరిమితం కాకుండా ఒకడుగు ముందుకేసి బీజేపీలో ఆమెను చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఇది కూడా అగ్రనేతలకు గిట్టడం లేదు. ఈ అంశాలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలెవ్వరూ వ్యక్తిగత వ్యాఖ్యలతో పార్టీకి డ్యామేజ్‌ చేయొద్దంటూ రాష్ట్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇష్టానుసారంగా మీడియా ముందుకు రావొద్దనీ, వారు అడిగే ప్రశ్నలకు నోరుజారొద్దని వార్నింగ్‌ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. వారిద్దరూ తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ కార్యాలయంలో చేశారు కాబట్టి పార్టీ ఎజెండాగానే పరిగణిస్తారనీ, ఇది పార్టీకి నష్టం కలిగించేలా ఉందని హైకమాండ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వినికిడి. హైకమాండ్‌ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఏం మాట్లాడాలనే దానిపై హితబోధ చేసినట్టు తెలిసింది. పలువురు నేతలు పార్టీ లైన్‌ దాటి మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. సొంత ఎజెండాలు పక్కనపెట్టాలని, పార్టీ ఎజెండాను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. సబ్జెక్టు లేకుండా ఇష్టానుసారంగా ప్రెస్‌మీట్‌లు కూడా పెట్టొదని హెచ్చరించినట్టు తెలిసింది. కేవలం కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలనే ఎత్తిచూపుతూ..మోడీ ప్రభుత్వం ఘనతలను చెబుతూ ముందుకెళ్లాలని ఆదేశించినట్టు తెలిసింది. మోడీ పాలన గురించి ప్రజల్లో పాజిటివ్‌ అంశాలను తీసుకెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం జూన్‌లో ప్రత్యేక కార్యక్రమం కూడా తీసుకోబోతున్నట్టు సమాచారం. దీనిపై రాష్ట్ర నాయత్వానికి గైడ్‌లైన్స్‌ ఇచ్చేందుకు త్వరలో రాష్ట్ర ఇన్‌చార్జి సునిల్‌ బన్సల్‌ రాబోతున్నట్టు ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -