Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనోరు జారొద్దు

నోరు జారొద్దు

- Advertisement -

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సీఎం రేవంత్‌ రెడ్డిపై అనవసరంగా నోరు పారేసుకోవద్దని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను హెచ్చరించారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిందని విమర్శించారు. అసెంబ్లీని అడ్డుకోవడానికే ఆ పార్టీ సభ్యులకు శిక్షణ ఇచ్చినట్టు కేటీఆర్‌ మాటలతో తెలుస్తున్నదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఇది కండ్లకు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. పదేండ్లు బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలిపారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలనీ, ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు సీఎం రేవంత్‌ రెడ్డి సమాధానం చెబుతారన్నారు. ఏ అంశంపైన అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, అయితే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సీఎం మాటలను వక్రీకరిస్తున్న కేటీఆర్‌ : సంపత్‌
రాహుల్‌ గాంధీకి కావాలనుంకుంటే కాంగ్రెస్‌ కార్యకర్తలే రూ.1,000 కోట్లు ఇస్తారన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాటలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వక్రీకరించారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో కేటీఆర్‌ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. తన తండ్రి, తాత దేశానికి ప్రధానమంత్రులుగా పని చేసినా రాహుల్‌ గాంధీకి సొంత ఇల్లు లేదని తెలిపారు.

భూదాన్‌ దొంగ కేటీఆర్‌ : చనగాని దయాకర్‌
భూదాన్‌ దొంగ కేటీఆర్‌ అని టీపీసీసీ జనరల్‌ సెక్రెటరీ చనగాని దయాకర్‌ విమర్శించారు. మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కాంగ్రెస్‌ సర్కారు అన్ని విధాల ఆదుకుంటున్నదని తెలిపారు. రైతు బంధు పేరుతో బినామీలకు కొండలకు గుట్టల పేర్లతో దోచి పెట్టి ప్రజలను దగా చేశారని కేటీఆర్‌పై మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -