Tuesday, October 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురైతుకు నష్టం కలగొద్దు

రైతుకు నష్టం కలగొద్దు

- Advertisement -

కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలి : సీఎం రేవంత్‌ రెడ్డి
మొంథా తుపాన్‌ నేపథ్యంలో చర్యలు
ధాన్యం చెడిపోకుండా టార్ఫాలిన్‌ల వినియోగం
కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు: ఉన్నతాధికారులకు
మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వర్ష సూచనల నేపథ్యంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా కొనుగోళ్లు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మొంథా తుపాను ప్రభావం తెలంగాణపై ఉండే అవకాశముండటంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. వానాకాలం ధాన్యంతో పాటు మొక్కజొన్న పంటలు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని అందుబాటులో ఉన్న టార్పాలిన్‌లను వినియోగించి చెడిపోకుండా చూడాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించేందుకు అవసరమైన రవాణా వసతి ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాబోయే 30 నుంచి 45 రోజుల వరకు ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం సమిష్టిగా పని చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో వరి కోతలు నిలిపేస్తే రైతులకు ఇబ్బంది ఉండదని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే 4,428 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు తెలిపారు. మిగిలిన 3,814 కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలన్నారు.

సోమవారం నాటికి 22,433 మంది రైతుల నుంచి 1,80,452 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. అందులో దొడ్డు రకం 73,628 మెట్రిక్‌ టన్నులు, సన్నాలు 1,06,824 మెట్రిక్‌ టన్నులున్నాయనీ, వాటి విలువ రూ.431.09 కోట్లు అని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ జరపాలనీ, కొనుగోలులో రైతులకు ఎక్కడా ఆటంకాలు కలుగకుండా చూడాలని అన్నారు. కేంద్రాలను ఎప్పటికప్పుడు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.

అవినీతి ఉపేక్షించం
ధాన్యం కొనుగోలు సమయంలో అవినీతి చోటు చేసుకుంటే ఉపేక్షించేది లేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈ తరహా ఆరోపణలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. తమ ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వమని గుర్తుచేశారు. ఏ కారణం చేతనైనా సరే .. రైతులకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్‌, కమిషనర్‌ గోపి, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, డైరెక్టర్‌ హనుమంతు కొండుబా, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీ బాయి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -