రైతుల ఆందోళతో దిగొచ్చిన కేంద్రం
రాష్ట్రాలకు కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ లేఖ
న్యూఢిల్లీ : నానో ఎరువుల అమ్మకాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. నానో ఎరువులు, బయోస్టిమ్యులెంట్లను బలవంతంగా రైతుల కు అమ్మడాన్ని తక్షణమే నిలిపివేయాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈమేరకు లేఖ రాశారు. యూరియా, డీఏపీ వంటి సబ్సిడీపై లభించే సాంప్రదాయ ఎరువుల స్థానంలో రైతులకు బలవంతంగా నానో ఎరువులను విక్రయించవద్దని లేఖలో మంత్రి స్పష్టం చేశారు. నానో ఎరువులు కొనుగోలు చేయకపోతే రైతులకు సాంప్రదాయ ఎరువులను విక్రయించడం లేదని వస్తున్న ఫిర్యాదులను మంత్రి ప్రస్తావించారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. నకిలీ, నాసిరకం ఎరువుల అమ్మకాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించడం, సబ్సిడీ ఎరువుల మళ్లింపు వంటి కార్యకలాపాలను రాష్ట్రాలు కఠినంగా పర్యవేక్షించాలని, వాటిపై వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఎరువుల ఉత్పత్తి, అమ్మకాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని రాష్ట్రాలకు సూచించారు. సాంప్రదాయ ఎరువులకు బదులుగా నానో ఎరువులు, బయోస్టిమ్యులెంట్ల విక్రయాలు పెంచాలన్న కేంద్రం నిర్ణయంపై దేశంలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేశారు. సాంప్రదాయ ఎరువులతో పోలిస్తే వీటి ధర అధికంగా ఉండటం, వీటి వినియోగంతో సరైన దిగుబడులు రాకపోవడంతో అన్నదాతలు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
బలవంతంగా ‘నానో’ ఎరువులు అమ్మొద్దు
- Advertisement -
- Advertisement -